అభివృద్ధినిచూసి ప్రతిపక్షాలు కుళ్లుకుంటున్నాయి.. మంత్రి ఎర్రబెల్లి

by Disha Web Desk 20 |
అభివృద్ధినిచూసి ప్రతిపక్షాలు కుళ్లుకుంటున్నాయి.. మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్‌ ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం, చెర్లపాలెం, గోపాలగిరి గ్రామాలు కలిపి చెర్లపాలెం గ్రామ శివారులో, అలాగే, కర్కాల, అమర్ సింగ్ తండా, దుబ్బా తండా, హరిపిరాల గ్రామాలు కలిపి హరిపిరాల గ్రామ శివారులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు చెర్లపాలెంలో 20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.

గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కార్యకర్తలే నా బలం.. ప్రజలే నా బలగమని.. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయని తెలిపారు. వాటిని కార్యకర్తలు ఇంటింటికీ తీసుకుపోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు నీరు పుష్కలంగా లభించి వ్యవసాయ బాగా పంటలు పండుతుండడంతో సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులు రాజుగా మారుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటైతే కరెంటు ఉండదని, దీపాలు పెట్టుకోవాల్సి వస్తుందని హేళన చేసిన పార్టీల నోరు మూయించేలా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాకముందు ఏ గ్రామానికి వెళ్లినా కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు దర్శనమిచ్చేవని, పంటలు ఎండిపోయేవన్నారు. ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.

రోహిణి కార్తె వస్తే పంట పెట్టుబడి లేక రైతు గుండె దడదడలాడేదని, ఎట్ల నాటేసుకుంటమో… ఏదైనా బంగారం కుదవ పెట్టుకునేటోళ్లు, షావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ బాగా ఆలోచించి పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. రైతు చనిపోతే రూ.ఐదు లక్షలు వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో పడుతున్నాయన్నారు. పంట దళారుల పాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. మిషన్‌ కాకతీయతో చెరువు, కుంటలను అపురూపంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణ పై అడుగడుగునా వివక్షచూపుతున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలను మంజూరుచేస్తే తెలంగాణకు ఒక్కటీ కేటాయించలేదని చెప్పారు. ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మోదీ తెలంగాణపై క్షక్షగట్టి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్త మార్పు కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని వివరించారు. దేశంలో ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ర్టాల్లో ఆకలి చావులు ఉన్నాయని, మోదీ ప్రధాని అయ్యాక ఇవి మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలోని బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. గుజరాత్‌లో రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్లు, రైతులకు ఉచిత కరంట్‌ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పు చిన్న అంజయ్య , జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, సీనియర్ నాయకులు చిదిరాల చంద్రయ్య, సర్పంచులు సట్ల నాగలక్ష్మి, బూర్గుల సరోజన సరోజన, రావుల మమతారెడ్డి, ధర్మారపు శ్రీనివాసరావు, సేగ్యం సురేఖ, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ లింగాల వెంకటనారాయణ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, వైస్ఎంపీపీ ఇట్టే శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపీటీసీలు వల్లపు గోపమ్మ, అలివేలు, ధర్మారపు కిరణ్, నాయకులు రామ సహాయం కిషోర్ రెడ్డి, రాయిశెట్టి వెంకన్న, అంకూస్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed