బీజేపీ నిజ‌స్వరూపం బ‌య‌ట‌ప‌డింది: మంత్రి ఎర్రబెల్లి

by Web Desk |
బీజేపీ నిజ‌స్వరూపం బ‌య‌ట‌ప‌డింది: మంత్రి ఎర్రబెల్లి
X

దిశ‌, హ‌న్మకొండ టౌన్: తెలంగాణపై ఉన్న అక్కసును వెళ్లగ‌క్కి ప్రధాని మోడీ మ‌రోసారి నిజస్వరూపం బయటపెట్టారని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ విన‌య్‌భాస్కర్‌, వ‌ర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేష్‌ల‌తో క‌లిసి మంత్రి మీడియా స‌మావేశం నిర్వహించారు. 60 ఏళ్ల పోరాటం, వేలాది మంది త్యాగాలు, నాటి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ పోరాట ప‌టిమ‌కు త‌లొగ్గి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింద‌న్నారు. కేసీఆర్ ఉద్యమంతో దిగొచ్చిన నాటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ‌బ‌ద్ధంగా అన్ని పార్టీల అభిప్రాయాలు, ప‌లు క‌మిటీల సూచ‌న‌ల‌తో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో, రాజ్యస‌భ‌లో ప్రవేశ‌పెట్టార‌ని మంత్రి తెలిపారు.

తెలంగాణ బిల్లును పార్లమెంటులో, రాజ్యస‌భ‌లో ఆమోదం పొంద‌కుండా అడ్డుకునేందుకు ఎన్ని శ‌క్తులు కుట్రలు చేసినా.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగింద‌ని అన్నారు. విభ‌జ‌న బిల్లులో పొందుప‌ర్చిన విధంగా తెలంగాణకు రావాల్సిన హ‌క్కుల‌ను కేంద్రంలోని బీజేపీ అమ‌లు చేయ‌కుండా హక్కులు కాల‌రాస్తున్నార‌ని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోకుండా.. వెనుక‌బాటుకు గురైన తెలంగాణ రాష్ట్రం.. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో అన‌తికాలంలోనే అభివృద్ధి చెందింద‌ని అన్నారు. అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో దేశంలోనే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. కేంద్రం స‌హకారం లేకున్నా.. ఆద‌ర్శంగా నిలిచిన తెలంగాణ ప‌ట్ల ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని హేళన చేస్తే ప్రజ‌లు ఊరుకోర‌ని, అలాంటి వారిని త‌రిమికొడ‌తారని అన్నారు. దేశ ఫెడరల్ స్ఫూర్తికి మోడీ మాటలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయ‌ని, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న కాకినాడ తీర్మానాన్ని తుంగలో తొక్కింది బీజేపీ కాదా? అని ప్రభుత్వ చీఫ్ విప్ విన‌య్‌ భాస్కర్ అన్నారు.

నాడు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి మూడు రాష్ట్రాలను విభజించిన బీజేపీ తెలంగాణ విభజనను ఎందుకు ఆమోదించడం లేదన్నారు. తెలంగాణ విభజనకు మీరు వ్యతిరేకం కాబట్టే విభజన హామీలు అమలు చేయడం లేదా? అని బీజేపీని ప్రశ్నించారు. మీ వల్లే వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, బీజేపీ నాయ‌కులకు తెలంగాణ ప‌ట్ల మాట్లాడే హ‌క్కు లేద‌ని విమ‌ర్శించారు. ఏ రాజ్యాంగ విభజన స్ఫూర్తితో, ఏ ప్రజల అనుమతితో లోయర్ సీలేరు ప్రాజెక్ట్ సహా, ఏడు మండలాలను ఆనాడు ఆంధ్రాలో కలిపార‌ని వ‌ర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేష్ ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతార‌ని, బీజేపీ నిజస్వరూపం ఇదే అని, రాజ్యస‌భ సాక్షిగా మరోసారి ప్రధాని మోడీ చాటారని, ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.



Next Story

Most Viewed