మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: MLC కవిత డిమాండ్

by Disha Web Desk 19 |
మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: MLC కవిత డిమాండ్
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర దేవాలయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సందర్శించారు. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీ కవితకి ఘన స్వాగతం పలికారు. గట్టమ్మ దేవాలయం వద్ద పూజలు చేసిన అనంతరం రామప్ప ఆలయానికి చేరుకొని రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయ విశిష్టతను గైడ్ సహాయంతో తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో, పాలంపేట ప్రజల కోరిక మేరకు రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని తెలిపారు. ఆలయం నిర్మించిన శిల్పి పేరుపై ఉన్న రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రం కళాకారులను గౌరవించడంలో ముందుంటుందని తెలియజేస్తుందన్నారు. రామప్ప అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రామప్పని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ అడగకుండానే ములుగు వాసులకు జిల్లా ప్రకటించారు అని.. ముఖ్యంగా ఆదివాసీల కోసమే జిల్లా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీకి కోసం 334 ఎకరాల భూ కేటాయింపు జరిగిందని.. సమీకృత కలెక్టరేట్ కోసం 50 ఎకరాల స్థలం కూడా కేటాయించామని చెప్పారు. ములుగు జిల్లా వాసులకు కొంగు బంగారంగా మెడికల్ కళాశాల ఉంటుందన్నారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన మహా జాతర సమ్మక్క సారాలమ్మలు కొలువు తీరడం ములుగు జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. మేడారం జాతరకు జాతీయ హోదాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ , టీఎస్ రెడ్కు చైర్మన్ మరియు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఏరువా సతీష్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు వీరమల్ల ప్రకాష్, నాగుర్ల వెంకన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed