భయం వీడితే విజయం మీదే: డీఐఈఓ సత్యనారాయణ

by Disha Web Desk 11 |
భయం వీడితే విజయం మీదే: డీఐఈఓ సత్యనారాయణ
X

దిశ, కొత్తగూడ: విద్యార్థులకు చదువుకు మించిన ధనం లేదని, పరీక్షల సమయంలో భయం వీడితే విజయం వారిదేనని డీఐఈఓ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకన్న ఆధ్వర్యంలో కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల జూనియర్ కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఒరియంటేషన్ అండ్ మొబిలిటి స్కిల్స్ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఐఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలంటే విద్యార్థుల్లో ఒక రకమైన భయం నెలకొంటుందని, ఎన్ని పరీక్షలు రాసినా ప్రతి పరీక్ష కొత్తగానే అనిపిస్తుందన్నారు.

పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉంటారని, దీంతో చదివింది గుర్తుకు రాక, జవాబులు రాయలేక మార్కులు కోల్పోతుంటారని అన్నారు. పరీక్షలంటే పండుగలాంటివని విద్యార్థి సంవత్సరం అంతా కష్టపడి చదివితే మార్కులు అనే ఫలితం వస్తుందని, ఆ ఫలితాన్నే పండుగ అంటారన్నారు. అలాగే మోటివేటర్ బ్రహ్మ కుమారి కల్పనా మాట్లాడుతూ.. పరీక్షలంటే భయం సహజమే, అవసరాన్ని మించిన భయం మంచిది కాదని చెప్పారు. విద్యార్థికి సమయపాలన చాలా ముఖ్యమన్నారు. భయం, ఒత్తిడితో సమయం వృథా చేయొద్దని పరీక్ష హాల్ కి సంపూర్ణ విశ్వాసంతో వెళ్లాలన్నారు. తొలుత ప్రశ్నపత్రాలను పరిశీలించి, తెలిసిన ప్రశ్నలన్నింటికీ ముందుగా జవాబులు రాయాలని చెప్పారు.

ఆ తర్వాత సందేహం ఉన్న ప్రశ్నలకు జవాబులు రాస్తే కొంత ఒత్తిడి తగ్గుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన కళాశాల ప్రిన్సిపాల్ మమతా శ్రీ, గంగారం కేజీబీవీ ప్రిన్సిపాల్ సుజాత, అధ్యాపక బృందం దయాకర్, వనమాల, సత్యనారాయణ, పడతయ్య, అశోక్, నాగరాజు, గౌస్, రవి , రాంప్రసాద్, కుసుమ సంధ్య, విజయ్ కుమార్, నిజామొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed