ఠాణాలో మహిళ హల్ చల్

by Dishanational1 |
ఠాణాలో మహిళ హల్ చల్
X

దిశ, రఘునాథపల్లి: ఓ మహిళా పోలీస్ స్టేషన్లో గంటన్నర పాటు హల్చల్ చేసిన ఘటన గురువారం జనగామ జిల్లా రఘునాథపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జహీరా బేగం అనే మహిళా బుర్కా ధరించి పోలీస్ స్టేషన్లోకి వచ్చింది. మీరంతా అవినీతికి పాల్పడుతున్నారు.. నేను ఇక్కడ జరిగేదంతా వీడియో తీస్తున్నాను.. తర్వాత చెప్తాను.. అంటూ పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఎస్ఐ వీరేందర్ తన క్యాబిన్లో ఉండగా, ఠాణలో ఒకరిద్దరు మేల్ పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్యతో ఆమె గంటకు పైగావాదనకు దిగింది. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ పని మీద వచ్చిన వాళ్లంతా ఆమె చేస్తున్న హల్చల్ ను చూస్తూ మిన్నకుండిపోయారు. మొదట ఎవరికీ ఆమె గురించి అర్థం కాలేదు. అయితే పోలీసులకు మాత్రం ఆమె మెంటల్లి డిజార్డర్ వ్యక్తి అని తెలియడంతో ఏమీ అనకుండా ఉన్నారు. ఆమె మెంటల్లీ డిజార్డర్ అయినప్పటికీ మాట్లాడే మాటల్లో మాత్రం అలాంటి విధానం కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఉన్నవారు, కొత్తగా చూస్తున్నవారు నిచ్చెస్టులై ఆమెనే చూస్తూ ఉండిపోయారు.

ఆమె పోలీస్ సిబ్బందితో వాదనకు దిగిన సమయంలో స్టేషన్లో మహిళా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మేల్ సిబ్బంది ఆమెను ఏమీ అనలేకపోయారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని పోలీసులకు తెలిసినా, అక్కడికి వచ్చి చూసేవారికి మాత్రం అది తెలియక ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్ సాయంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లి వదిలేశారు. ఆమె రఘునాథపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటుంది. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్లను కూడా ఇలాగే పలుమార్లు ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నట్లు పోలీస్ లకు ఫిర్యాదులు కూడా వచ్చినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. గతంలో ఓ సారి బస్టాండ్ ప్రాంతంలో తాను హెడ్ కానిస్టేబుల్ ను, మఫ్టీలో ఉన్నాను అంటూ పలువురు వాహనదారులను బెదిరించి ఫొటోలు తీసినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయకపోతే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఇబ్బంది పడ్డట్లుగానే ఆమె నివాసం ఉంటున్న కాలనీవాసులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Next Story