ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యసేవలు..

by Disha Web Desk 20 |
ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యసేవలు..
X

దిశ, జనగామ : ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా జనగామ జిల్లా మెడికల్ హబ్ గా మారి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ పట్టణంలోని మున్సిపల్ రోడ్డులో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన రేడియాలజీ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న జిల్లాల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న జనగామ జిల్లాగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చోరువతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా ఉన్నతమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఇందుకోసం అనేక పథకాలను ప్రవేశ పెడుతూ ఉందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ టీ హబ్, ఏర్పాటుచేసి అత్యుత్తమ సేవలు అందిస్తు దేశంలో మంచిగుర్తింపు సాధించిందని అన్నారు. అదేవిధంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పిల్లలకు, తల్లులకు అందుతున్న వైద్యసేవల పై జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆస్పత్రిగా అవార్డులు అందుకుందని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో 100 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి వచ్చే విద్యాసంవత్సరం నుండి తరగతులకు ప్రారంభం కానున్నాయని అన్నారు. రేడియాలజీ ల్యాబ్ లో క్యాన్సర్ తో పాటు, గుండె సంబంధించిన వ్యాధులు, అన్ని వర్గాల వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉందన్నారు.

రూ.కోటితో వైద్య అల్ట్రాసౌండ్, టుడీఎకో, స్కానింగ్, క్రేయోతెరపి, స్కోపి, తదితర అత్యాధునిక వైద్య పరికరాలు జనగామ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ప్రజలు ఈ సౌకర్యాలను చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్డే సిద్దిలింగం, ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవీందర్ గౌడ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపాల్ రావు, జడ్పీటీసీ దీప్తి, ఎంపీపీ కళింగరాజు, స్థానిక కౌన్సిలర్ కళ్యాణి, సహకార సంఘం చైర్మన్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed