వడగండ్ల వర్షం ఎఫెక్ట్: చెదిరిన గూడు.. రోడ్డున పడిన కుటుంబాలు..

by Disha Web Desk 11 |
వడగండ్ల వర్షం ఎఫెక్ట్: చెదిరిన గూడు.. రోడ్డున పడిన కుటుంబాలు..
X

దిశ, నర్సంపేట: శనివారం ఈదురుగాలులతో పాటు వడగండ్లతో కూడిన భారీ వర్షం ఎడతెరపి లేకుండా గంటల తరబడి కురువడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా నిర్మించుకున్న ఇండ్ల పైకప్పులు లేచిపోయి నేలమట్టమైనాయి. దీంతో పలు కుటుంబాలు నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డాయి. నర్సంపేట శివారులోని కాకతీయనగర్ సమీపంలో రెండు సంవత్సరాల క్రితం ఇల్లు లేని నిరుపేదలు తాత్కాలిక ఇండ్లు నిర్మించుకున్నారు.

ఈ క్రమంలో శనివారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల వర్షానికి ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. రాళ్ల వాన కారణంగా ఇండ్లు కూలిపోయి రేకులు, కట్టెలు ఇంట్లో నిద్రిస్తున్న వారిపై పడటంతో కొంతమందికి స్వల్ప గాయాలైనాయి. నిల్వ ఉంచుకున్న బియ్యం, వంట సామాగ్రి తడిసి పనికి రాకుండా అయ్యాయి. ఈ నేపథ్యంలో సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ సభ్యులు కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భయాందోళనలో బతుకుతున్న పేదలు వేసుకున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని, శాశ్వత నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed