పని భారం.. పైసలు దూరం..

by Disha Web Desk 20 |
పని భారం.. పైసలు దూరం..
X

దిశ, దంతాలపల్లి : మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో తొలిమెట్టు అయిన గ్రామపంచాయతీలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఆరు నెలలుగా కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడ‌ని జీవితాలు వారివి. పూటగ‌డ‌వ‌డం కోసం ఎన్నో తంటాలు ప‌డుతున్న దుర్భ‌ర జీవితం. అలాంటి పంచాయ‌తీ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు రాక‌పోవ‌డంతో తీవ్రఇబ్బందులు ప‌డుతున్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఐదు, ఆరు నెలలుగా జీతాలందడం లేదు. చాలా పంచాయతీలను నిధుల కొరత వేధిస్తుండడం, నిధులున్న చోట జీపీ అకౌంట్ల ఫ్రీజింగ్ సమస్యతో సర్పంచ్ లు వారికి జీతాలు ఇవ్వలేకపోతున్నారు.

చెక్కులు జనరేట్ చేసి ట్రెజరీలకు పంపితే క్లియర్ కావడం లేదని సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య కార్మికులుగా, వాటర్ మన్ గా, స్ట్రీట్ లైట్ ఆపరేటర్లు, ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ తమ కుటుంబాలను పోషించుకోవడానికి అవస్థలు పడుతున్నారు. నెలనెలా జీతాలు రాకపోవడంతో తెలిసినవారి దగ్గర అప్పులు చేసి సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఒక్కో కార్మికుడికి కనీసం ఐదు నుంచి ఆరు నెలల జీతాలు పెండింగ్ లో ఉండటం గమనర్హం.

చాలీచాలని జీతాలకు పంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్నానని ఓ పంచాయతీ కార్మికుడు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారడు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పూట గడవడమే కష్టంగా మారిందని, కుటుంబం పస్తులుంటున్నదని చెబుతున్నారు. ప్రభుత్వం త్వరగా వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.

8500తో బతికేదేట్ల!

పెరిగిన ధరలతో పోలిస్తే తమకు వచ్చే జీతాలు సరిపోవడం లేదని, తమకు జీతాలు పెంచాలని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ చాలా కాలంగా కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కార్మికుల జీతాన్ని 2014, 2015, 2017, 2022లో సర్కారు నాలుగుసార్లు పెంచినప్పటికీ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులను మాత్రం పట్టించుకోవడంలేదు. వీరికి చట్టబద్ధంగా అమలు చేయాల్సిన కనీస వేతన చట్టాన్ని వర్తింపజేయడం లేదు. తమ జీతాలు పెంచితే గ్రామపంచాయతీలకు అధికంగా ఇవ్వాల్సి ఉంటుందనే జీతాలు పెంచడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అన్నింటికీ ఒక్కడినే !

తమ గ్రామ పంచాయతీలో తాను ఒక్కడినే గ్రామ పంచాయతీ సిబ్బందినని ఓ కార్మికుడు తెలిపారు. ట్రాక్టర్, ఎలక్ట్రీషియన్, పారిశుధ్య, వాటర్ మెన్ అన్నింటికీ నేనే కార్మికున్ని ఇంత చేసిన జీతం నెల నెల రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ముగ్గురు ఆడపిల్లలను చదివించడం, సంసారం నెట్టుకురావడం భారంగా మారింది. ఈ నెలతో జీతం రాక పదినెలలు దయచేసి సకాలంలో జీతం ఇవ్వగలరని కోరుకుంటున్నారన్నారు.



Next Story

Most Viewed