బంజారాల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి : మంత్రి సీత‌క్క

by Ratna Kumari |

బంజారా కులస్తులు భవన నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించిన‌ట్టు మంత్రి సీత‌క్క తెలిపారు.

బంజారాల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి : మంత్రి సీత‌క్క
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలోని బంజారా కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని.. అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధ‌వారం జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ గుడి వద్ద తెలంగాణ ప్రభుత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి నిర్వ‌హించారు. మంత్రి సీత‌క్క‌తో పాటు క‌లెక్ట‌ర్ దివాక‌ర టీ.ఎస్, గ్రంథాల‌య చైర్మ‌న్ బానోత్ ర‌విచంద‌ర్, మున్సిప‌ల్ చైర్మ‌న్ చింత నిప్పుల చంద్ర‌క‌ళ బిక్ష‌ప‌తి హాజ‌రై పూజ‌లు నిర్వ‌హించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బంజారా కులస్తులు భవన నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించిన‌ట్టు తెలిపారు. రాబోయే రోజులలో ప్రభుత్వం వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. సమావేశానికి ముందు సీతక్క బంజారా భాషలో మాట్లాడి అబ్బురపరిచారు. అనంత‌రం కలెక్టర్ మాట్లాడుతూ చదువు వ‌ల్ల‌నే ప్రతి జాతి బాగుపడుతుందని, చదువు, ఆరోగ్యం మీద శ్రద్ధ కనబరచాలని సూచించారు. అభివృద్ధి చెందిన వారు మిగతా వారి అభ్యున్నతికి పాటు పడాలని, జిల్లాలో గిరిజన అధికారులు సామాజిక అభివృద్ధి అంశాలలో చొరవ తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు పోరిక గోవింద్ నాయక్, పూజారులు రమేష్ గిరి మహారాజ్, కిషన్ మహారాజ్, ఐటిడిఏ అధికారి జనార్ధన్, రాహుల్, బంజారా కులస్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story