గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..

by Disha Web Desk 11 |
గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
X

దిశ, హన్మకొండ: కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న గ్రామ ఉప సర్పంచ్ సహా నలుగురి ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు రూ. 34 లక్షల విలువ గల 170 కిలోల గంజాయి, ఒక కారు, గంజాయి రవాణాకు వినియోగించిన ఒక బోలెరో సరుకు రవాణా వాహనం, మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో రాయినేని శంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గొరుకొత్తపల్లి, ముసిక లక్ష్మణ్ వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం నీరుకుళ్లు గ్రామంచ, మాట మహేష్ ములుగు జిల్లా బండారుపల్లి గ్రామం, గండికోట సతీష్ ములుగు జిల్లా పస్రాకు చెందిన వారిగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ పి. కరుణాకర్ వివరాలను మీడియాకు వెల్లడించారు.

పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో రాయినేని శంకర్, నీరుకుళ్ల గ్రామ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకుగాను ఆంధ్రరాష్ట్రంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నిందితులు మిగితా ఇద్దరు నిందితులతో కల్పి ఆంధ్రప్రదేశ్ లోని నర్సీపట్నంలోని నూకరాజు (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు) ద్వారా 170కిలోల గంజాయిని కొనుగోలు చేసి, దానిని రెండు కిలోల ప్యాకేట్ల చొప్పున బోలేరో వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరి బొండాల మధ్యలో రహస్యంగా భద్రపర్చి వరంగల్ కు తరలించారు.

ఈ గంజాయిని వరంగల్ తరలించే క్రమంలో ప్రధాన నిందితులు శంకర్, గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మణ్ మరోకారులో గంజాయిని తరలిస్తున్న కారుకు ఎస్కాగా వ్యవహరించేవారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు ఆత్మకూర్ గ్రామ శివారు ప్రాంతంలో మంగళవారం నిర్వహించిన తనీఖీల్లో అనుమానస్పదంగా వస్తున్న నిందితులు వాహనాలను అదుపులోకి తీసుకొని తనీఖీ చేయగా బొలేరో వాహనంలో కొబ్బరి బొండాల మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ శివరామయ్య, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు కె.శ్రీనివాసరావు,

వెంకటేశ్వర్లు, ఆత్మకూర్ ఇన్ స్పెక్టర్ బి.కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు లవణకుమార్, నిసార్పాషా, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలత,

కానిస్టేబుళ్లు శ్యాం, రాజు, బిక్షపతి, సురేష్, శ్రవణ్ నవీన్, కరుణాకర్లను ఈస్ట్ జోన్ డీసీపీ అభినందించారు.

Next Story

Most Viewed