వరంగల్ బస్టాండ్ లో ఘోర ప్రమాదం.. రెండు బస్సుల మధ్య ఇరుక్కొని యువకుడు దుర్మరణం..

by Disha Web Desk 11 |
వరంగల్ బస్టాండ్ లో ఘోర ప్రమాదం.. రెండు బస్సుల మధ్య ఇరుక్కొని యువకుడు దుర్మరణం..
X

దిశ, వరంగల్ టౌన్: వరంగల్ బస్టాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సుల మధ్య ఓ యువకుడు ఇరుక్కొని చనిపోయాడు. గురువారం జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్లితే.. కాశిబుగ్గ ప్రాంతం చింత హరిజనవాడకు చెందిన చింత సారంగపాణి, మల్లిక దంపతుల కుమారుడు చరణ్ అలియాస్ సన్నీ (17) మిత్రులతో కలిసి వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో అల్పాహారం తినడానికి వెళ్లాడు. ఈ క్రమంలో బస్టాండ్ నుంచి బయటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే, బస్టాండ్ లో నిలిపి ఉన్న బస్సు ముందు భాగం నుంచి వెళ్తుండగా, అదే సమయంలో నిజామాబాద్ 1 డిపోకు చెందిన బస్సు పార్క్ చేసేందుకు రివర్స్ లో వచ్చి మొదటి బస్సును ఢీకొంది. అప్పటికే మొదటి బస్సు ముందు నుంచి వస్తున్న చరణ్ రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నాడు. అతని మిత్రులు మాత్రం అప్పటికే మొదటి బస్సును దాటేశారు.

చివరకు ఉన్న చరణ్ మాత్రం బస్సుల మధ్య ఇరుక్కొని మృతి చెందాడు. జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న చరణ్ కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున బస్టాండ్ కు తరలివచ్చారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చరణ్ మృతి చెందాడని ఆగ్రహంతో బస్సు అద్దాలు పగల గొట్టారు. విషయం తెలుసుకున్న ఇంతేజర్ గంజ్ పోలీసులు రంగంలోకి దిగి, ఆందోళన కారులను శాంతింప జేసి, మృతదేహన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు చరణ్ పుట్టినరోజు బుధవారమే చేసుకున్నాడని, మరుసటి రోజే ఈ ఘటన జరగడంతో యువకుడి తల్లి రోదనలు అందరినీ కలచి వేశాయి.


Next Story

Most Viewed