ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి

by Taduka Kalyani |

దేవరుప్పుల మండలం కోలుకొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ సభ్యత్వ నమోదు శిక్షణ తరగతులు జిల్లా నాయకుడు పల్లా సుందర్‌రాం రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, పాలకుర్తి: దేవరుప్పుల మండలం కోలుకొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) సభ్యత్వ నమోదు శిక్షణ తరగతులు జిల్లా నాయకుడు పల్లా సుందర్‌రాం రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసి చైతన్యం కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ పాలకుర్తి గడ్డ ఉద్యమ చరిత్రకు ప్రతీక అని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ ఉద్యమాలకు ముందుండే సంప్రదాయం కలిగిన వారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనను ఓ మూర్ఖుడి చేతిలో పెట్టారని విమర్శించారు.

బూత్ స్థాయి బలమే పార్టీ బలోపేతానికి మెట్టు

బూత్ స్థాయి బలమే పార్టీ బలమని, ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేస్తే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. గ్రామీణ మౌలిక వసతులు, రైతు సంక్షేమం, విద్యుత్ సరఫరా రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. పార్టీ బలాన్ని గ్రామ స్థాయిలో మరింత పటిష్టం చేయాలని కార్యకర్తలకు సూచించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యం పెరిగితేనే పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఎల్‌ఏల (Booth Level Agents) పాత్ర అత్యంత కీలకమని నాయకులు పేర్కొన్నారు. బూత్ స్థాయిలో ఓటరు జాబితాల సవరణ, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, పుస్కూరి శ్రీనివాస్, తీగల దయాకర్ గౌడ్, కోతి స్రవంతి, గాంధీ నాయక్‌తో పాటు పలువురు నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువజన, సోషల్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story