- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాశాఖ మంత్రిగా సోనం వాంగ్చుక్ ఉండాలి! కాక్రోచ్ పార్టీ ధర్నాలో ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం బెంగుళూరులోని ఫ్రీడమ్ పార్క్లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జరిగిన ఈ ఆందోళనలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే సహా పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. నీట్ (NEET) పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
నిరసనలో ప్రముఖుల కీలక వ్యాఖ్యలు..
దేశ విద్యాశాఖ మంత్రిగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఉంటే చూడాలని ఉందని నటుడు ప్రకాశ్ రాజ్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సోనమ్ వాంగ్ చుక్ స్పందిస్తూ.. మంత్రిగా ఉండే వ్యక్తి తనలా ఆలోచించే వాడు కావాలి తప్ప, తనకు ఆ పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. దెబ్బతిన్న విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అండగా నిలిచేందుకే తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ.. వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నందుకే తమను కొందరు ‘బొద్దింకలు (Cockroaches)’ అని పిలుస్తున్నారని విమర్శించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఆందోళనలు
బెంగుళూరు కంటే ముందు ఉదయం హైదరాబాద్లోని ధర్నా చౌక్లోనూ భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ పోరాటం రాజకీయ అధికారం కోసం కాదని, కేవలం ప్రజల్లో అవగాహన పెంచి వారి హక్కులను కాపాడటానికేనని వాంగ్ చుక్ హైదరాబాద్ సభలో స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇప్పటికే ఢిల్లీ, పూణే, లక్నో, అమృత్సర్ తదితర నగరాల్లోనూ సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి.






