బీఆర్ఎస్ పార్టీకి డా.గుండాల మదన్ కుమార్ రాజీనామా..

by Dishaweb |
బీఆర్ఎస్ పార్టీకి డా.గుండాల మదన్ కుమార్ రాజీనామా..
X

దిశ, హనుమకొండ టౌన్ : బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి డా. గుండాల మదన్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాజీనామాకు గల కారణాలు చెప్పారు. 2001 నుండి నేటి వరకు ఎంతో కష్ట-నష్టాలకు ఓర్చుకొని శ్రమించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టించుకోవడం లేదు అన్నారు. ఉద్యమకారులకు ఇవ్వవలసిన నామినేటెడ్ పదవులు ఇతర పార్టీల నుంచి పిలిపించి వారికి ఇస్తున్నారు అంటూ, ఉద్యమకారులపై 20 సం.లుగా ఉన్న కేసులు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎత్తివేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు అని అన్నారు. రైతుబంధు పేరుతో వ్యవసాయం చేయని భూములకు పెట్టుబడి కింద వందల ఎకరాలు ఉన్న అగ్రకులస్తులకు, భూస్వాములకు మేలు చేస్తున్నారు. ధరణిలో 13 కాలమ్ నుండి అనుభవదారు కాలమ్ తీసివేసి కౌలు రైతులకు అన్యాయం చేస్తున్నారు అని, నిరుద్యోగులకు శుభవార్త చెప్పినట్లే చెప్పి పరీక్షల నిర్వహణలో వైఫల్యం, గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంలో టీ.ఎస్.పీ.ఎస్.సీ. సభ్యులపై చర్యలు తీసుకోవడం లేదు అంటూ ఇప్పటివరకు ఉద్యోగ నియామక ప్రక్రియ కాలేదు అన్నారు.

ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారిపోయి తెలంగాణ యువత నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అన్నారు. గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ కట్టించడంలో విఫలం అయిన నర్సంపేట యం.ఎల్.ఎ. నర్సంపేట ప్రజలకు అన్యాయం చేశారు అని అన్నారు. చట్టసభల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,ఎంపీ, చైర్మన్ పోస్టుల్లో బీ.సీలకు ప్రాధాన్యం లేకపోవడం , బీసీలకు వాటా దక్కడం లేదు. బీ.సీ.లకు రిజర్వ్ అయిన నర్సంపేట, నెక్కొండ మార్కెట్ కమిటీ కూడా వేయడం లేదు అన్నారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ వల్ల ఎలాంటి లాభం లేదని ఎన్నిసార్లు చెప్పినా కేసిఆర్ పట్టించుకోవడం లేదు అని అన్నారు. 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు అని ఇలా అనేక బీసీ కులాలకు చట్టసభ ప్రాతినిధ్యం లేకుండా కుట్రలు పన్నుతున్నారు అని మాట్లాడారు. ఆయన వెంట ముదిరాజ్ సంగం రాష్ట్ర నాయకులు డ్యాగల శ్రీనివాస్ , వెంకన్న, స్వామి, కుమారస్వామి తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed