నర్సంపేటలో సాగుతున్న పట్టణాభివృద్ధి పనుల్లో జాప్యం

by Dishanational2 |
నర్సంపేటలో సాగుతున్న పట్టణాభివృద్ధి పనుల్లో జాప్యం
X

నర్సంపేట పట్టణంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల కోసం గతంలో పెద్ద మొత్తంలో నిధులు మంజూరైన సంగతి తెలిసిందే. అయినా పట్టణ అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి కాలేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పట్టణ అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపట్లేదని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో పట్టణ అభివృద్ధి పనులు నల్లేరు మీద నడకగా మారింది. మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నామని చెప్తున్నా పనులు మాత్రం అనుకున్నంత మేర కొనసాగకపోవడంతో పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఉన్నా త్వరితగతిన పనులు కొనసాగించడంలో మున్సిపాలిటీ వెనకపడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ల ప్రక్రియ సకాలంలో పూర్తి చేసి పనులు చేయాల్సి ఉన్నా పర్యవేక్షణ లోపం కారణంగా ఉహించినంత పురోగతి ఉండట్లేదు.

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం గతంలో పెద్ద మొత్తంలో నిధులు మంజూరైన సంగతి తెలిసిందే. కాగా, పట్టణ అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి కాలేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా నర్సంపేట పట్టణ అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపట్లేదని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో పట్టణ అభివృద్ధి పనులు నల్లేరు మీద నడకగా మారింది. మున్సిపాలిటీలో నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నామని చెప్తున్నా అనుకున్నంత మేర పనులు కొనసాగకపోవడం పట్టణ ప్రజలను నిరుత్సాహంలోకి నెట్టేస్తున్నారు.

పైసలున్నా పనుల్లో జాప్యం..

నర్సంపేట మున్సిపాలిటీకి పట్టణ అభివృద్ధి కోసం రూ.15కోట్లు విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, మంజూరైన నిధులతో పట్టణ అభివృద్ధి పనులు, డ్రైనేజీ, ఇతర పనులకు నిధుల కేటాయింపు సైతం మున్సిపాలిటీ పూర్తి చేసింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా నర్సంపేట పట్టణ అభివృద్ధి పనుల పరిస్థితి మారింది. నిధులు ఉన్నా త్వరితగతిన పనులు కొనసాగించడంలో మున్సిపాలిటీ వెనకపడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో కేటాయించిన వివిధ అభివృద్ధి పనులకు టెండర్ల ప్రక్రియ సకాలంలో పూర్తి చేసి అభివృద్ధి పనులు చేయాల్సి ఉన్నా పర్యవేక్షణ లోపం కారణంగా రోజురోజుకు చేపట్టాల్సిన పనుల్లో ఉహించినంత పురోగతి ఉండట్లేదు.

చేపట్టాల్సిన పనులివే..!

నర్సంపేట పట్టణంలోని వరంగల్‌రోడ్డు మలుపు వద్ద, అంబేద్కర్‌ సెంటర్‌, పాకాల్‌ రోడ్‌(జయలక్ష్మి సెంటర్‌) జంక్షన్ల అభివృద్ధికి రూ.80లక్షలు కేటాయించారు. వీటిలో వరంగల్‌ రోడ్డు జంక్షన్‌కు రూ.40లక్షలు, అంబేద్కర్‌ సెంటర్‌కు పాకాల్‌రోడ్‌ జంక్షన్లకు రూ.20లక్షల చొప్పున కేటాయించారు. జంక్షన్లు విశాలంగా ఉండేలా తీర్చ‌దిద్దాల్సి ఉంది. పట్టణంలోని జంక్షన్ల మధ్య గ్రీనరీ, ఫౌంటెయిన్లు, లైటింగ్‌ తదితర ఏర్పాట్లను పూర్తి చేయాలి. వరంగల్‌రోడ్డులో ఏర్పాటు చేసే జంక్షన్‌ మధ్య వలయాకారంలో నిర్మాణం చేసి తెలంగాణతల్లి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న గెస్ట్‌హౌస్‌ ప్రహరీ కొంత భాగం తొలగించి గ్రీనరీ, నర్సంపేట మున్సిపల్‌ బోర్డును ఏర్పాటు చేసేలా నమూనా సిద్ధం చేశారు. పాకాల వెళ్లే రోడ్డులో త్రిబుజాకారంలో ఏర్పాటు చేయనున్న జంక్షన్‌ మధ్య గ్రీనరీతోపాటు జింకలు, కోతి మధ్యలో పెద్దపులి (టైగర్‌) బొమ్మలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో ఎంపిక చేసిన వరంగల్‌రోడ్‌, అంబేద్కర్‌ సెంటర్‌, జయలక్ష్మి సెంటర్‌ జంక్షన్ల అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉంది. ఏప్రిల్‌ ఆఖరు లేదా మే మొదటి వారం వరకు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

రెండో దశలో మరో మూడు జంక్షన్లు..!

మొదటి విడుత రూ.80లక్షలతో పనులు చేపడుతుండగా, దాదాపు అంతే వ్యయంతో రెండోవిడత పనులు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. రెండో దశలో స్థానిక అంగడీ సెంటర్‌, వ్యవసాయ మార్కెట్‌ సమీపంలోని వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతం, సర్వాపురం(బైపాస్‌) వద్ద జంక్షన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితోపాటుగా సర్వాపురంలో హైవే రోడ్డు మధ్యలో వాటర్‌ ఫౌంటెన్‌, క్లాక్‌టవర్‌, చేప, ధారపోసే వాటర్‌ఫాల్స్‌, రెండు చేతుల్లో భూగోళం, చెతుల్లో మొక్కను పట్టుకున్న డిజైనింగ్‌ నమూనా చిత్రాలను అధికారులు సిద్ధం చేశారు. మొదటి విడుతలో చేపట్టే పనులు పూర్తయ్యాక, రెండో దశ జంక్షన్ల పనులను చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అంబేడ్కర్ సెంటర్‌లో పనులయ్యేనా..!

నర్సంపేట పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా అంబేడ్కర్ సెంటర్‌లో రూ.20లక్షలతో పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అంబేడ్కర్ సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహం దగ్గర స్థలం తక్కువగా, ఇరుకుగా ఉండడం, ఎన్‌హెచ్ఏఐ అధికారుల చర్చించాల్సి ఉండడంతో ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

నెమ్మదిగా పనులు..!

పట్టణ అభివృద్ధిలో భాగంగా మొదలైన పనులు నెమ్మదించాయి. ముందుగా పాకాల సెంటర్‌లో అభివృద్ధి పనులు మొదలైనా నత్త నడకన సాగుతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి పనులు పూర్తి అవ్వాలని టార్గెట్‌గా పెట్టుకున్నప్పటికీ మరో రెండు నెలల వరకు కొనసాగే పరిస్థితి నెలకొన్నది. వరంగల్ జంక్షన్‌లోని గెస్ట్ హౌస్ గోడ కూల్చివేత పనులు మాత్రమే నేటికి పూర్తయ్యాయి. కాగా, టెండర్లకు కాంట్రాక్టర్లు ఎవరూ సాహసించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో పలు అభివృద్ధి పనులు చేసిన సదరు గుత్తేదారుతోనే నర్సంపేట అభివృద్ధి పనులు మొదలు పెట్టడం గమనార్హం.



Next Story