ఆ అధికారులను గ్రామాల్లోకి రానివ్వకండి.. కాంగ్రెస్ పిలుపు

by Web Desk |
ఆ అధికారులను గ్రామాల్లోకి రానివ్వకండి.. కాంగ్రెస్ పిలుపు
X

దిశ, చెన్నారావుపేట: సహకార సంఘం అధికారులు గ్రామంలోకి రాకుండా రైతులు, కాంగ్రెస్ నాయకులు ఎడ్లబండి అడ్డంగా పెట్టి అడ్డుకున్న ఘటన గురువారం చెన్నారావుపేట మండలం అక్కల్‌చేడ గ్రామంలో చోటుచేసుకుంది. సహకార సంఘానికి సంబంధించిన రుణాలు తీసుకున్న రైతులను అప్పు కట్టాలని బెదిరింపులకు గురిచేస్తున్న కారణంగా అడ్డుకున్నట్లు రైతులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకే దఫాలో రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ ఓట్ల కోసం రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు సహకార సంఘ అధికారులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ సురేష్, మలోత్ పుల్ సింగ్, భూక్య రాజు, మలోతు చకృ, రాజు, ఈర్యా తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed