ఇచ్చిన మాటను నిల‌బెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

by Ratna Kumari |

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో మ‌ల్లంప‌ల్లి గ్రామాన్ని మండ‌ల కేంద్రంగా చేస్తాన‌ని హామి ఇచ్చాడు. ఇచ్చిన‌ట్టుగానే ఆహామీ నెర‌వేర్చాడ‌ని మంత్రి సీత‌క్క గుర్తు చేశారు.

ఇచ్చిన మాటను నిల‌బెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్ష హోదాలో కొన‌సాగిన విష‌యం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి పాద‌యాత్ర చేసిన సంద‌ర్భంగా మల్లంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు నూత‌న మండ‌లాన్ని ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింద‌ని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు నూతన మండలాన్ని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ ( సీతక్క) అన్నారు.

బుధవారం మల్లంపల్లి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10లక్ష‌ల‌తో గ్రామ ఐక్య సంఘం నూతన భవన నిర్మాణం, సీఎంఆర్ నిధుల ద్వారా 72.50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే మండలంలోని శ్రీనగర్ గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ నూతనంగా చేపట్టబోయే పనులను వేగవంతం చేసి త్వరతగతిన పూర్తి చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా నూతన భవనాల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చ‌యంతో ఉందన్నారు. ఒక సంవత్సరంలోనే 40 నూతన భవనాలను జిల్లా వ్యాప్తంగా నిర్మించడం జరిగిందని, నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండలంలో అన్ని శాఖలకు చెందిన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి నూతన భవనాలను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో వివిధ వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీ ప్రభుత్వమే భరిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో మరికొన్ని నూతన మండలాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. డిలిమిటేషన్ కారణంగా నూతన మండలాలను ఏర్పాటు చేయడం సాధ్యం కావడం లేదని, గ్రామాలలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తూ ప్రోత్సహించాలని అన్నారు. క‌లెక్ట‌ర్ దివాక‌ర్ టీఎస్ మాట్లాడుతూ వ‌ర్షాకాలం ప్రారంభం నాటికి జిల్లాలో 368 చెక్ డ్యాం లను ఏర్పాటు చేయబోతున్నామని, ఇప్పటికే 70 శాతం వరకు రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, డిఆర్డిఓ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, అడిషనల్ డిఆర్డివో శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ సునీత, మండల ప్రత్యేక అధికారి కృపాకర్, ఆయా గ్రామాల సర్పంచులు ల్యాద శ్యామ్ రావు, ఆకుల మల్లేష్ పాల్గొన్నారు.

Next Story