ఎస్సై కుర్చీలో తాగుబోతు హల్‌చల్! టోపీ పెట్టుకుని ఫైళ్లు చించేసిన వైనం.. ఎందుకు అలా చేశాడు?

by Ramesh Naini |

ఒక యువకుడు పీకలదాకా మద్యం తాగి పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా దోయామి పోలీస్ అవుట్‌పోస్టులో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎస్సై కుర్చీలో తాగుబోతు హల్‌చల్! టోపీ పెట్టుకుని ఫైళ్లు చించేసిన వైనం.. ఎందుకు అలా చేశాడు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన గోడును పోలీసులు పట్టించుకోవడం లేదని కోపం తెచ్చుకున్న ఒక యువకుడు పీకలదాకా మద్యం తాగి పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా దోయామి పోలీస్ అవుట్‌పోస్టులో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీస్ స్టేషన్‌లో రచ్చ రచ్చ..

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. చొక్కా లేకుండా స్టేషన్‌లోకి ప్రవేశించిన ఆ యువకుడు, నేరుగా వెళ్లి ఎస్సై కుర్చీలో కూర్చున్నాడు. పోలీసుల టోపీ పెట్టుకుని, బల్ల గుద్దుతూ ఇన్‌స్పెక్టర్‌లా ఫోజులిచ్చాడు. టేబుల్ మీద ఉన్న పలు ఫైళ్లపై సంతకాలు చేసి, మరికొన్ని ముఖ్యమైన ఫైళ్లను చించి గాల్లోకి విసిరేశాడు. ‘స్పాట్‌లోనే తీర్పు చెప్పేస్తా’ అంటూ కేకలు వేస్తూ.. పూలకుండీలను నేలకేసి కొట్టాడు. తలుపు అద్దాలు, మెయిన్ గేటు, బెంచీలను ధ్వంసం చేశాడు.

అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఈ ఘటన జరిగిన సమయంలో స్టేషన్‌లో అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జితో సహా పోలీసు సిబ్బంది ఎవరూ లేరు. వారు భోజనాల కోసం వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. అయితే, శబ్దాలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా శ్రమించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అద్దాలు పగులగొట్టే క్రమంలో ఆ యువకుడి చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర సెక్షన్ల కింద అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Next Story