అసత్య ప్రచారం మానుకోవాలి.. కొత్తూరు సర్పంచ్..

by Disha Web Desk 20 |
అసత్య ప్రచారం మానుకోవాలి.. కొత్తూరు సర్పంచ్..
X

దిశ, ఖానాపూర్ : నర్సంపేటలోని గీతాంజలి డీజీ స్కూల్ బస్సు వెనుక అద్దం పగిలిఉందన్న సాకు చూపుతూ గత మూడు రోజులుగా కుట్ర పూరితంగా స్థానిక ఏ టీవీలో ప్రసారం అవుతున్న స్క్రోలింగ్ పై స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం స్పందించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ మండలం కొత్తూరు సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ ఏ టీవీలో ప్రసారం అవుతున్న స్కూల్ బస్సు కథనం పై ఆందోళన వ్యక్తం చేశారు. గత బుధవారం సాయంత్రం పిల్లలను ఇంటికి తీసుకువచ్చే క్రమంలో పిల్లలను దింపి వెనుతిరిగే క్రమంలో బస్సు వెనుక అద్దానికి చెట్టుకొమ్ము తాకడంతో పగిలిపోయిందన్నారు.

ఈ సాకుతో పిల్లలకు రక్షణ ఉందా..? అధికారులు ఉన్నారా లేరా..? అంటూ వరుసగా ఒక్క ఏ టీవీలోనే వస్తున్న కథనాల పట్ల పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. గత 10-15 ఏండ్లుగా తమ పిల్లలను సదరు స్కూల్ కి పంపిస్తున్నామని ఏ రోజూ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. అనవసరంగా పిల్లల్లో భయాన్ని కలిగించేలా వార్తలు రాస్తున్న ఏటీవీ యాజమాన్యం తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

గీతాంజలి డీజీ స్కూల్ ప్రిన్సిపాల్ సుబ్బారావు మాట్లాడుతూ గీతాంజలి డీజీ స్కూల్ బస్సు అద్దాలు పగిలి ఉందన్న కారణంగా వరుస స్క్రోలింగ్స్ వేస్తున్న ఏ టీవీ వైఖరిని తప్పు పడుతున్నామన్నారు. గత 20 ఏండ్లుగా స్కూల్ ని నడిపిస్తున్నామన్నారు. స్కూల్ లో 18 బస్సులు ఉన్నాయన్నారు. ఇన్ని ఏండ్లలో ఇప్పటి వరకు ఏ చిన్నప్రమాదం జరిగలేదన్నారు. బుధవారం సాయంత్రం బస్సు వెనక్కి తీసే క్రమంలో చెట్టు కొమ్మ తాకడంతో బస్సు వెనుక అద్దం పగిలిన మాట వాస్తవం అని అన్నారు.

గురువారం రోజు అద్దాన్ని అమర్చామని తెలిపారు. వేల మందిని తీర్చిదిద్దిన స్కూల్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. ఏ టీవీ వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నాను. సభ్యసమాజానికి సరైన సమాచారాన్ని అందించాల్సిన మీడియా వైపు నుండి ఈ ప్రవర్తనను ఉహించలేదన్నారు. పిల్లల, వారి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసేలా వార్తలు రాయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పిల్లల రక్షణ పట్ల అన్ని నిబంధనలు పాటిస్తున్నాం. భవిష్యత్ లో ఇలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాం.

Next Story

Most Viewed