జనగామ పోలీసుల వలలో పశువుల దొంగల ముఠా

by Kodari Anjali |

జనగామ జిల్లాలో వరుసగా పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను జనగామ పోలీసులు అరెస్టు చేశారు.

జనగామ పోలీసుల వలలో పశువుల దొంగల ముఠా
X

దిశ, జనగామ: జనగామ జిల్లాలో వరుసగా పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను జనగామ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర్ల వెంకట్రావు, చిత్తూరి గంగాధర్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 7 గేదెలు, 2 మొబైల్ ఫోన్లు, అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితులు పశువుల దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా వీరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తెలంగాణలో నివాసం ఏర్పరుచుకుని జనగామ పరిసర ప్రాంతాల్లో హైవే పక్కన పొలాలు, దొడ్లలో కట్టిన గేదెలను అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనంలో ఎత్తుకెళ్లి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

పత్రాలు కోరగా నిందితులు..

మే, జూన్ నెలల్లో జనగామ శివారులో మూడు విడతల్లో పశువులను దొంగిలించి, వాటిలో కొన్నింటిని వినుకొండ పశువుల సంతలో విక్రయించి వచ్చిన నగదును ముఠా సభ్యులు పంచుకున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. ఇటీవల వాహనాల తనిఖీల సందర్భంగా గేదెలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని పోలీసులు ఆపి పశువులకు సంబంధించిన రసీదులు, పత్రాలు కోరగా నిందితులు చూపలేకపోయారు. దీంతో అనుమానం వచ్చి విచారించగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. డీసీపీ రాజమహేందర్ నాయక్ ఆదేశాల మేరకు, ఏసీపీ బీమా శర్మ పర్యవేక్షణలో జనగామ ఇన్‌స్పెక్టర్ పి. సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఐ ఎం. భరత్తో పాటు కానిస్టేబుళ్ల బృందం ఈ కేసును ఛేదించింది. ప్రతిభ కనబర్చిన పోలీసు బృందాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

Next Story