ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడాలి : కేటీఆర్

by Ratna Kumari |

తెలంగాణ ఆర్టీసీని ప్ర‌భుత్వం విలీనం చేయాల‌ని, పీఆర్సీ అమ‌లు చేయాల‌ని కోరుతూ ఆత్మ‌హుతికి పాల్ప‌డిన న‌ర్సంపేట డిపో డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప‌రామ‌ర్శించారు.

ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడాలి : కేటీఆర్
X

దిశ, నర్సంపేట : తెలంగాణ ఆర్టీసీని ప్ర‌భుత్వం విలీనం చేయాల‌ని, పీఆర్సీ అమ‌లు చేయాల‌ని కోరుతూ ఆత్మ‌హుతికి పాల్ప‌డిన న‌ర్సంపేట డిపో డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప‌రామ‌ర్శించారు. నర్సంపేట నియోజకవర్గం ముత్తోజిపేటలోని శంకర్ గౌడ్ నివాసానికి వెళ్లిన ఆయన.. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పార్టీ తరపున రూ. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆర్టీసీని విలీనం చేస్తామని, పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. రెండేళ్లు గడిచినా పట్టించుకోలేదన్నారు.


ప్రభుత్వం మాట తప్పడం వల్లే శంకర్ గౌడ్ లాంటి కార్మికులు బలి కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు."బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకుంద‌ని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. శంకర్ గౌడ్ మరణించినప్పుడు పరామర్శించడానికి వస్తే.. ప్రభుత్వం మమ్మల్ని అరెస్టులు చేయించింది. పెద్ది సుదర్శన్ రెడ్డిని 12 పోలీస్ స్టేషన్లు తిప్పి హింసించారు. ఇవాళ మేము వస్తున్నామని తెలిసి, ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం రూ. 10 లక్షలు చెక్కు ఇచ్చిందంటే వారి వైఫల్యం అర్థమవుతోందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ప్రాణత్యాగాలు చేయవద్దు. మీకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ మెడలు వంచైనా మీ హక్కులు సాధిస్తామన్నారు.

Next Story