చెరువు శిఖం హాంఫట్..రూ.5కోట్ల భూమిపై బకాసురుడి కన్ను

by Dishanational2 |
చెరువు శిఖం హాంఫట్..రూ.5కోట్ల భూమిపై బకాసురుడి కన్ను
X

దిశ, నెక్కొండ: వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ మండ‌లంలోని చంద్రుగొండ రెవెన్యూ శివారులో ఉన్న చెరువుల‌ శిఖం భూముల‌లో బీఆర్ఎస్ నేత క‌బ్జాకు పాల్ప‌డుతున్నాడు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 50 ఎకరాల భూమిని క‌బ్జా చేసేందుకు ప‌క్కా స్కెచ్‌తో ముందుకెళ్తున్నాడు.ఈ భూములకు సమీప దూరంనుండి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పోతుండడంతో సదరు నేత కన్నుపడింది.క‌బ్జా ప‌ర్వం య‌త్నంలో సుమారు 37 ఎక‌రాల మేర చెరువు శిఖం భూమి ఉండ‌గా, సుమారు 13 ఎక‌రాల మేర రైతులు సాగు చేసుకుంటున్న భూమి ఉండ‌టం గ‌మ‌నార్హం. ఎక‌రం రూ.10ల‌క్ష‌ల విలువ చేసే రూ.5కోట్ల భూమిని అప్ప‌నంగా మింగేందుకు కొన్నాళ్లుగా ప‌న్నాగంతో ముందుకెళ్తుండ‌టం గ‌మ‌నార్హం. మా భూమి క‌బ్జా చేస్తున్నారంటూ మండ‌ల రెవెన్యూ కార్యాల‌యంలో కొంత‌మంది రైతులు ఫిర్యాదు చేసినా అధికారుల్లో స‌రైన స్పందించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. స‌ర్వే చేస్తామంటూ జాప్యం చేస్తున్న అధికారులు..మ‌రోవైపు రికార్డులు సృష్టించేందుకు స‌ద‌రు నేత చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

అసలే జరిగిందంటే..

పర్వతగిరి మండలానికి చెందిన ఓ బీఆర్ ఎస్ ప్రజాప్ర‌తినిధి నెక్కొండ మండల రెవెన్యూ పరిధిలోని చంద్రుగొండ, తూర్పు తండా, గేటుపల్లి గ్రామాలలోని చెరువు శిఖం భూములను కబ్జా చేశాడని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 707లలోని భూములను 2018 వరకు కొందరు గిరిజనులు సాగుచేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఓ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి సర్వే నెంబర్ 707లో ఉన్న 13 ఎకరాల భూమితో పాటు చెరువు శిఖం భూముల్లో సైతం పెద్ద ఎత్తున్న మొరం, నల్ల రేగడి మట్టి పోసి చదును చేస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 675లో 197 ఎకరాల 30 గుంటల శిఖం భూములు ఉన్నాయి. దానిలో చాలావరకు కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలకు పాల్పడంతో రైతులు మూడు రోజులుగా పనులను అడ్డుకొని తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. గురువారం తహసీల్దార్ డీఎస్ వెంకన్న, ఐబీ డీఈ సంతోష్ తదితర అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కళ్ల ముందే చెరువు శిఖం భూముల్లో అక్రమంగా మొరం, రేగడి మట్టి పోసిన ఆనవాళ్లు ఉన్నప్పటికి అధికారుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. రూ. 5కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతమ‌వుతున్నా సర్వే చేస్తామంటూనే అధికారులు ప‌క్క‌న పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

కబ్జారాయుళ్లపై చర్యలు శూన్యం..?

జేసీబీలు, ట్రాక్టర్లతో ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్‌, చెరువు శిఖం భూములలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు సమాచారం అందించిన సకాలంలో స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువు శిఖంభూముల‌ను ఆక్ర‌మించేందుకు మ‌ట్టి, మొరంల‌ను డంప్ చేస్తున్న ఫొటోల‌ను, వీడియోల‌ను ఆధారంగా అధికారులకు చూపిన‌ప్ప‌టికీ ఏమాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంద‌ని రైతులు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా తమ భూములతో పాటు ప్రభుత్వ భూములు కబ్జాకు గురౌతున్నట్టు పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపానపోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి సైతం తనకు పట్టా ఉన్నట్టు ధీమాగా ఉన్నారు. తాను ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేయలేదని,సర్వే చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

రైతులకు న్యాయం చేయాలి

-గటిక అజయ్ కుమార్,మాజీ ఎంపీపీ,బీజేపీ నాయకులు

కొన్ని సంవత్సరాలుగా సర్వే నెంబర్ 707లో రైతులు సాగుచేసుకుంటున్నారు.ఆ భూములను పర్వతగిరి బీఆర్ఎస్ జడ్పీటీసీ,వారి కుటుంబ సభ్యులు అక్రమపట్టా చేసుకొని రైతులను భయబ్రాంతులకు గురిచేస్తు అక్రమ నిర్మాణాలు చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.పర్వతగి జడ్పీటీసీ సింగులాల్,బంధువులు ప్రభుత్వ,అస్సైన్మెంట్ భూముల్లో ఫిల్లర్లు వేసి ఫాం హౌజ్ నిర్మాణానికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అన్నారు. 50 ఫీట్ల రోడ్డు నిర్మాణంతో పాటు,పెద్ద ఎత్తున్న రైతుల,ప్రభుత్వ చెరువు శిఖం భూములు అన్యాక్రాంతం అవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.సోమవారం వరకు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.

ప్రభుత్వ భూములు అక్రమిస్తే చర్యలు తీసుకుంటాం

-తహసీల్దార్ డి ఎస్ వెంకన్న

అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు తీసుకుంటాం.సర్వే నెంబర్ 675లో 197ఎకరాల 30 గుంటలు చెరువు శిఖం భూములున్నాయి. 707 లోని అస్సైన్మెంట్ భూమిలో కొంతమంది రైతులకు పట్టాలు ఇచ్చాం.ఇదే సర్వే నెంబర్ లో కొందరు వ్యక్తులు ఫిల్లర్లు వేసి నిర్మాణాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. పట్టా లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లైతే వాటిని తీసివేస్తాం. వారం రోజుల్లో సర్వే చేసి,హద్దులు ఏర్పాటు చేస్తాం.అక్రమంగా ఎవరైనా ప్రభుత్వ భూమిని అక్రమించినట్టు తేలితే సదరు వ్యక్తులపై కేసు నమోదు భూములను స్వాధీనం చేసుకుంటాం.

Read More: బ్రేకింగ్: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ కన్నుమూత

దర్జాగా భూ కబ్జా చేసి దేవుడికే శఠగోపం పెడుతున్న భూ బకాసురులు!


Next Story

Most Viewed