నాడు తెలంగాణ ఎట్లుండే.. నేడు ఎట్లుంది..

by Disha Web Desk 20 |
నాడు తెలంగాణ ఎట్లుండే.. నేడు ఎట్లుంది..
X

దిశ, హనుమకొండ టౌన్ : తెలంగాణ ప్ర‌జ‌లు గుండె మీద చెయ్యి వేసి ఆలోచించాలి నాడు తెలంగాణ ఎట్లుండే, నేడు తెలంగాణ ఎట్లుందని ప్ర‌భుత్వ చీఫ్ విప్‌, ప‌శ్చిమ శాస‌న‌స‌భ్యులు, బీఆర్ఎస్ పార్టీ హ‌న్మ‌కొండ జిల్లా అధ్య‌క్షులు దాస్యం విన‌య్ భాస్క‌ర్ అన్నారు. ఒక‌వైపు సంక్షేమం - మ‌రో వైపు అభివృద్ధి కార్య‌క్ర‌మాలను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేశంలో ఎక్క‌డా లేనివిధంగా తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్నార‌ని ఆయన అన్నారు. 51, 52, 59 డివిజ‌న్ల బీఆర్ఎస్ నేతల ఆత్మీయ స‌మ్మేళ‌న కార్య‌క్ర‌మాన్ని శుక్ర‌వారం హనుమకొండ లోని క‌ళ్యాణి ఫంక్ష‌న్ హ‌ల్ లో నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ మొద‌టి సీఎం కేసీఆర్ సందేశాన్ని కార్య‌క‌ర్త‌ల‌కు చ‌దివి వినిపించారు. దేశంలో ఎక్క‌డా అమ‌లు కాని సంక్షేమ ప‌థ‌కాలు కేవ‌లం తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్నాయ‌ని అన్నారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ఏ ఒక్క ప‌థ‌కానికి నోచుకున్న పాపాన పోలేద‌ని అన్నారు. నేడు స్వ‌రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు వంటి అనేక వినూత్న ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయ‌ని తెలిపారు. నాడు తెలంగాణ‌లో అన్నదాత ఏడుపు, ఆకలి కేకలు ఉండేవ‌ని కానీ నేడు కేసీఆర్ రైతు బాంధ‌వుడై రైతును రాజును చేశాడ‌ని అన్నారు. పండిన ప్ర‌తీ గింజ‌ను కొనుగోలు చేస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామ‌ని వివ‌రించారు. అనంతరం క‌వి, గాయ‌కుడు, ర‌చ‌యిత‌, ఉద్య‌మ‌కారుడు, శాస‌న‌మండ‌లి స‌భ్యులు దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే మ‌న కుటుంబం అని, ఆత్మీయ సమ్మేళనంలో అంద‌రం మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుందామ‌ని అన్నారు. రాబోయేదీ తెలంగాణ ప్ర‌భుత్వ‌మే బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కార్య‌క‌ర్త‌ల‌కు బ‌లం అని బ‌ల‌గం అని అన్నారు.

తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మ‌నం చూస్తూనే ఉన్నాం. మోదీ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు పేపర్ లీక్ వీరులు అని ఎద్దేవా చేశారు. పద్దెనిమిది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక సార్లు పరీక్ష పేపర్లు లీకైన సంఘటనలు మనం చూస్తున్నామ‌ని అన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికి పది సార్లు పేపర్లు లీకైన ఘ‌ట‌న‌లున్నాయ‌ని వివ‌రించారు. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ , ఏప్రిల్ 14న దేశంలోనే అత్యంత ఎత్తు అయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్క‌రించ‌నున్న నేప‌థ్యంలో ఆ రోజున‌ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. ఏప్రిల్ 25 వరకు డివిజన్ స్థాయిలో వివిధ కమిటీలు ఏర్పాటు చేయాల‌ని అన్నారు.

ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు. ఏప్రిల్ 30 న డా.బీఆర్.అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామాల్లో పల్లెల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని అన్నారు. మేడే వేడుకలను ఘనంగా నిర్వ‌హించుకోవాల‌ని సూచించారు. అదే విధంగా కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవాల‌ని తెలిపారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా నిర్వ‌హించుకోవాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి , పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్ , కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story