మీరా - మేమా..? కాంగ్రెస్‌లో ముదిరిన అంత‌ర్యుద్ధం

by Bhanu |

మీరా - మేమా..? కాంగ్రెస్‌లో ముదిరిన అంత‌ర్యుద్ధం
X

దిశ‌, వరంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ జిల్లా కాంగ్రెస్‌లో కొండా వ‌ర్సెస్ ఎమ్మెల్యేల రాజ‌కీయ యుద్ధం మొద‌లైంది. కొండా ముర‌ళీ వ్యాఖ్య‌లపై ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌, వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ‌రాజు, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య‌, మేయ‌ర్ గుండు సుధారాణి, కుడా చైర్మ‌న్ ఇనుగాల వెంక‌ట్రాం రెడ్డి ఆగ్ర‌హ జ్వాల‌ల‌తో ర‌గిలిపోతున్నారు. ఈమేర‌కు శుక్ర‌వారం ఉద‌యం ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి ఇంట్లో ర‌హ‌స్యంగా వీరంతా భేటీ అయ్యారు.

కొండా ముర‌ళీధ‌ర్‌రావు, సురేఖ‌లు త‌రుచూ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ ఎమ్మెల్యేల గౌర‌వాన్ని దెబ్బ‌తీస్తున్నార‌ని, ఈ విష‌యంపై సీరియ‌స్‌గా స్పందించ‌క‌పోతే ప్ర‌జ‌ల్లోకి, కాంగ్రెస్ క్యాడ‌ర్‌లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని చ‌ర్చించుకున్న‌ట్లు తెలిసింది. కొండా దంప‌తులపై పార్టీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధిష్ఠానాన్ని డిమాండ్ చేయాల‌ని తీర్మానించుకున్నారు. ఈ విష‌యంపై టీసీసీసీ అధ్య‌క్షుడు మ‌హేస్‌కుమార్ గౌడ్‌కు, సీఎం, పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు లిఖిత పూర్వ‌క విన‌తిప‌త్రం అంద‌జేయ‌డంతో పాటు ఏఐసీసీ నేత‌ల దృష్టికి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అధిష్ఠానానికి అల్టీమేటం..!

కొండా దంప‌తుల‌పై పార్టీప‌ర‌మైన వేటువేయాల‌ని ఎమ్మెల్యేలు ప‌ట్టుబ‌డుతున్న‌ట్లుగా స‌మాచారం. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఎమ్మెల్యేల భేటీ నేప‌థ్యంలో టీసీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్ గౌడ్ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేల‌కు స్వ‌యంగా ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్న‌ట్లు స‌మాచారం. మీడియా ఎదుట తొంద‌ర‌పాటుగా ఏం మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ అన్ని గ‌మ‌నిస్తూనే ఉంది. అధిష్ఠానం చ‌ర్య‌ల‌కు అంద‌రూ త‌లొగ్గాల్సి ఉంటుంద‌ని చెప్పిన‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలిసింది.

ఇదిలా ఉండ‌గా కొండా దంప‌తులు పార్టీలో ఉంటే తాము ఉండలేం అంటూ తేల్చిచెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశంపై హైద‌రాబాద్లో స్పందించిన పీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్ గౌడ్‌.. ఎవ‌రైనా పార్టీ లైన్‌లోన ప‌నిచేయాల‌ని, పార్టీకి విరుద్ధంగా ప‌నిచేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ కూడా కొండా ముర‌ళీ వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం ఇప్పుడు రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. కొండా ముర‌ళీ వ్యాఖ్య‌లు, ఎమ్మెల్యేల ప్ర‌తి స్పంద‌న‌నేప‌థ్యంలో పీసీసీ ఆధ్వ‌ర్యంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

అధిష్ఠానం వ‌ద్ద ఎవ‌రి బ‌ల‌మెంత‌..?

ఇప్పుడు పార్టీలో..అధిష్ఠానం వ‌ద్ద ఎవ‌రి బ‌ల‌మెంత‌..! ఎవ‌రు ఎక్కువ.. ఎవ‌రికి ఎక్కువ‌...ఎవ‌రు త‌క్కువ‌..ఎందుకు త‌క్కువా..? అన్న లెక్క‌లు తేల్చుకునేందుకు ఎమ్మెల్యేలు సిద్ధ‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. పార్టీకి కొండా దంప‌తులు కావాలో.. అంకితాభావంతో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతున్న తాము కావాలో.. తేల్చుకోవాలంటూ న‌లుగురు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి సూటిగా స్ప‌ష్టంగా త‌మ వైఖ‌రినివెల్ల‌డించిన‌ట్లుగా తెలుస్తోంది. కొండా దంపుతుల‌తో ఎమ్మెల్యేల‌కు పెరిగిన గ్యాప్‌ను త‌గ్గించేందుకు అధిష్ఠానం ఎంత వ‌ర‌కు కృషి చేస్తుంది..? ఎవ‌రి వైపు నిలుస్తుంది..? ఎమ్మెల్యేల‌ను బుజ్జ‌గిస్తూ..కొండా దంప‌తుల‌కు అండ‌గా నిలుస్తుందా..? ఎమ్మెల్యేల అల‌క‌ల‌ను.. ఆవేశానికి మ‌ద్ద‌తు ప‌లుకుతూ.. కొండా దంప‌తుల‌పై చ‌ర్య‌లకు దిగుతుందా అన్న‌ది ప్ర‌స్తుతానికి పొలిటిక‌ల్‌ స‌స్పెన్స్ అనే చెప్పాలి.


ఇదిలా ఉండ‌గా మ‌హేష్‌కుమార్ గౌడ్ హెచ్చ‌రిక‌ల త‌ర్వాత కూడా ఓ మీడియా సంస్థ‌తో సురేఖ మాట్లాడుతూ.. క‌డియం న‌ల్లికుట్లోడు.. నా మంత్రి ప‌ద‌వి పోతుంద‌ని ప్ర‌చారం చేస్తున్నాడు.. నాకు అదృష్టం ఉంది కాబ‌ట్టే నాకు మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది..ఆయ‌న‌కు అదృష్టం ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు వ‌చ్చింది.. నాకు మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన్నందుకు క‌డియం త‌ట్టుకోలేక‌పోతున్న‌డు..అంటూ ఆరోప‌ణ‌ల‌తో కూడిన విమ‌ర్శ‌ల‌ను కంటిన్యూ చేయ‌డం చూస్తుంటే మాత్రం కాంగ్రెస్‌లో రేకెత్తిన వ‌ర్గ‌పోరు మాత్రం ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Next Story