సర్కార్‌పై అనుమానం.. మళ్లీ సమ్మెకు దిగనున్న వీఆర్ఏలు

by Disha Web Desk 2 |
సర్కార్‌పై అనుమానం.. మళ్లీ సమ్మెకు దిగనున్న వీఆర్ఏలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ నిండు సభలో హామీ ఇచ్చి రెండేండ్లు. ఐనా నెరవేర్చకపోవడంతో వీఆర్ఏలు సమ్మె బాట పట్టారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా వీఆర్ఏల జేఏసీ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ చర్చలు ఫలించలేదు. మమ్మల్ని నమ్మండి.. సమ్మె విరమించండన్న ఆయన మాటలకు విలువ లేకుండాపోయింది. బుధవారం వీఆర్ఏ జిల్లా జేఏసీల సమావేశం హైదరాబాద్ లో జరిగింది. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని తెగేసి చెప్పారు. కనీసం ఎంత కాలంలో ఏయే హామీలను పరిష్కరిస్తారన్న అంశంపై ఇరుపక్షాల అంగీకార పత్రమైనా ఉండాలన్న షరతు విధించారు. కనీసం దసరా పండుగకైనా పే స్కేలు అమలు చేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నాండ్లుగా తమ డిమాండ్లను సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తారని ఎదురుచూశాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గురువారం నుంచి తమ సమ్మె యధావిధిగా కొనసాగించాలని రాష్ట్ర జేఏసీ తీర్మానించింది. నేడు మండల తహశీల్దార్ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాలు ఉంటాయని జేఏసీ నాయకుడొకరు 'దిశ'కు వివరించారు. రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కమిటీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.



Next Story

Most Viewed