ఓటర్ల జాబితా ప్రక్షాళన షురూ.. ఆధార్‌‌తో ఓటర్ ఐడీ లింక్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-19 02:00:29  IST  )

The Central Election Commission has started cleaning the voter list. It has taken steps to ensure that each person has only one vote.

ఓటర్ల జాబితా ప్రక్షాళన షురూ.. ఆధార్‌‌తో ఓటర్ ఐడీ లింక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటర్ల జాబితా ప్రక్షాళన మొదలుపెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఒకరికి ఒకే దగ్గర ఓటు ఉండే విధంగా చర్యలు చేపట్టింది. ఒకరికి ఒక రాష్ట్రంలోనే కాకుండా సమీప రాష్ట్రంలో కూడా ఓటు హక్కు ఉండటంపై ఫిర్యాదులు రావడంతో ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. ఒక్కొక్కరికి సొంత రాష్ట్రంలోనే కాకుండా సమీప రాష్ట్రంలో కూడా ఓటు హక్కు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. దీనిపై గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలోనే ఒకరికి వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నట్లు గుర్తించి వారి ఓట్లను తొలగించారు. ఓటరుకు ఎక్కడ ఓటు హక్కు ఉండాలో ఆప్షన్ అడిగి ఇతర ప్రాంతాల్లో ఓటును తొలగించారు. అయితే ఇది పూర్తి స్తాయిలో అమలు కాకముందే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు.

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఒక వ్యక్తికి ఒకే దగ్గర ఓటు ఉండాలని, అదే సమయంలో సొంత రాష్ట్రంలోనే కాకుండా సమీప రాష్ట్రంలో కూడా చెక్ చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా కసరత్తు మొదలుపెట్టారు. సాఫ్ట్ వేర్ సాయంతో వీటిని గుర్తిస్తున్నారు. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, సంవత్సరం, ఫొటో ఒకే విధంగా ఉన్న వాటిని సాఫ్ట్ వేర్ సాయంతో గుర్తిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన ఏపీ, తమిళనాడు జాబితాలతో పోలుస్తున్నారు. ఇక్కడ అక్కడ ఒకే విధమైన వివరాలు, ఫొటో ఉన్న వారిని ఇప్పటి వరకు 56వేల మందిని గుర్తించారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్..

ఆధార్ కార్డును ఓటరు జాబితాకు లింక్ చేయాలని కేంద్రం నిర్ణయించినందున ఆ ప్రక్రియ ప్రారంభమైతే లక్షల్లో రెండు మూడు ఓట్లు ఉన్నవారు దొరుకుతారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారు. ఏపీకి చెందిన వారు తెలంగాణలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వారు తెలంగాణ, ఏపీలో కూడా ఓటు వేస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న తమ గుర్తింపు, గ్యాస్, బ్యాంక్, ఇతర గుర్తింపు కార్డుల కోసం ఇక్కడ ఓటు నమోదు చేయించుకుంటున్నారని, అదే సమయంలో తమ సొంత గ్రామంలో ఓటు వేసి వస్తున్నారని, దీంతో ఓటింగ్ తక్కువ గా నమోదు అవుతుందని చెబుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ లో చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడంతో వారి ఓటు ఇంకా కొనసాగుతోందని, చనిపోయిన వారి వివరాలను ఓటరు జాబితాతో లింక్చేస్తే ఈజీగా తొలగించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇది విజయవంతం అయితే హైదరాబాద్ నగరంలో లక్షల్లో డబుల్ ఓట్లు తొలగించవచ్చని, దీంతో ఓటింగ్ శాతం పెరగడానికి అస్కారం ఉంటుందని చెబుతున్నారు. అయితే దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story