నకిలీ ఓఆర్ఎస్‌పై 8 ఏళ్లు పోరాడి విజయం

by Gantepaka Srikanth |

ఓఆర్ఎస్ అని భ్రమించేలా బ్రాండింగ్ చేస్తూ మోసపూరితంగా షుగర్ డ్రింక్స్‌ను విక్రయిస్తున్న కంపెనీలపై పోరాడి విజయం సాధించిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిషన్‌ డా. శివరంజని సంతోష్‌ను మెడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ బృందం ఆదివారం ఘనంగా సన్మానించింది.

నకిలీ ఓఆర్ఎస్‌పై 8 ఏళ్లు పోరాడి విజయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓఆర్ఎస్ అని భ్రమించేలా బ్రాండింగ్ చేస్తూ మోసపూరితంగా షుగర్ డ్రింక్స్‌ను విక్రయిస్తున్న కంపెనీలపై పోరాడి విజయం సాధించిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిషన్‌ డా. శివరంజని సంతోష్‌ను మెడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ బృందం ఆదివారం ఘనంగా సన్మానించింది. వాణిజ్యపరంగా అమ్మే చక్కెర పానీయాల్లో ‘ఓఆర్ఎస్’ అనే పదాన్ని జొప్పించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న కంపెనీలపై డా. శివరంజని ఎనిమిదేళ్లపాటు నిరంతరంగా చేసిన పోరాటానికి ఫలితంగా, ఆహార భద్రతా ప్రమాణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ వాణిజ్య బ్రాండ్‌కూ ఓఆర్ఎస్ అనే పదాన్ని తమ ఉత్పత్తుల పేరులో ఉపయోగించే అనుమతి ఉండదని ఆదేశించింది. ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, శాస్త్రీయ నైతికతకు పెద్ద విజయం అని మెడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ పేర్కొన్నారు. నకిలీ ఓఆర్ఎస్ సహా ఇలాంటి మోసపూరిత వ్యవహారాలపై మెడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ బృందం భవిష్యత్‌ కార్యాచరణపై, ప్రజల్లో అవగాహనను మరింత పెంచే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన ఓఆర్ఎస్ మాత్రమే డీహైడ్రేషన్‌ నివారణకు ప్రమాణికమని... అదే నిరంతరం కొనసాగేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మెడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ బృందం పేర్కొంది. డా. శివరంజని సంతోష్ సాధించిన ఈ విజయాన్ని వైద్యులు నిరంతర అవగాహన, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, బాధ్యాతాయుత చికిత్సకు గొప్ప ఉదాహరణగా వారు అభివర్ణించారు.

Next Story