నన్ను ఎదుర్కోలేకే మీడియాకు లీకులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలపై ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి స్పందన

by Disha Web Desk 13 |
నన్ను ఎదుర్కోలేకే మీడియాకు లీకులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలపై ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి స్పందన
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నాయకులపై మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ ఆయుధంగా ఉపయోగించుకుని ఇతర పార్టీ నేతలకు సబంధించిన డబ్బును పట్టుకోకున్నారని ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి చెందిన సొమ్మును భారీగా తరలించినట్లు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు విచారణలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేగడంతో ఈ ఆరోపణలపై సిద్దిపేట జిల్లాలో శనివారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వెంకట్రామిరెడ్డి స్పందిస్తూ.. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లకు ఓటమి తప్పదని గ్రహించే ఈ కేసుల తన ప్రమేయం ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు తప్పుడు లీకులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని పేద విద్యార్థులకు విద్య, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాల కోసం వంద కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. తానెలాంటి వాడినో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరికీ తెలుసని.. ఓట్ల కోసం నీచరాజకీయాలు చేసే వ్యక్తిని తాను కానన్నారు. ఇకనైనా తనపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.



Next Story