Vemula Prashanth Reddy: డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య

by Gantepaka Srikanth |

కేటీఆర్ స్పీచ్ విన్న తర్వాత ఢిల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Vemula Prashanth Reddy: డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ స్పీచ్ విన్న తర్వాత ఢిల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే కేటీఆర్ వరంగల్ సభ పెట్టారని.. మీటింగ్‌కు ఊహించని విధంగా రైతులు వచ్చారని తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని.. 100 రోజుల్లో చేస్తామన్న హామీలు 900 రోజులు అయినా నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ సభకు 2,000 మంది రాలేదని.. అందుకే హడావిడిగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టి తిట్ల దండకం అందుకున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే వీళ్ల ఎజెండా అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు.

అందరి చరిత్రలు తెలుసు?..

పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్ సీఎం రేవంత్‌ రెడ్డి మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని.. ఢిల్లీ నుంచి సీఎం ఇచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన చదివారని ఆరోపించారు. ఆయనకు అహంకారం పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర గురించి మాట్లాడాలంటే అందరి చరిత్రలు బయటకు వస్తాయని హెచ్చరించారు. వందల మంది తెలంగాణ యువకులను చంపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు. లెక్కలేనన్ని కమీషన్లు, కేసులు తమపైన పెడితే ఒక్కటైనా రుజువు అయ్యాయా అని ప్రశ్నించారు. కేటీఆర్ స్థాయి ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు అని.. నీ స్థాయి ఏంటి మహేశ్‌కుమార్ గౌడ్ అని నిలదీశారు. పాడి కౌశిక్‌రెడ్డి ప్రెస్ మీట్‌ను అడ్డుకుని కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై బీజేపీ గూండాలు దాడి చేశారని.. రేవంత్‌‌రెడ్డి, బండి సంజయ్ ఒక్కటయ్యారని ఆరోపించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కె.వాసుదేవరెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిషోర్‌గౌడ్,ఉపేంద్ర చారి పాల్గొన్నారు.

దాడి సరైంది కాదు: మాజీ ఎమ్మెల్సీ నారదాసు

కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద బీజేపీ గూండాలు దాడి చేయడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఖండించారు. దాడిలో భాగమైన వారందరిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించరాదని ప్రభుత్వానికి సూచించారు. ప్రజాప్రతినిధులు, వారి కార్యాలయాలకు భద్రత లేకుంటే ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు.

Next Story