బాసరలో అట్టహాసంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-26 06:40:30  IST  )

సకల జ్ఞానాలకు ఆది దైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంత పంచమి సందర్భంగా బాసరలో వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

బాసరలో అట్టహాసంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు
X

దిశ, ప్రతినిధి నిర్మల్: సకల జ్ఞానాలకు ఆది దైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంత పంచమి సందర్భంగా బాసరలో వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. బాసర దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. వసంత పంచమి అత్యంత పవిత్రమైనదిగా భావించే భక్తులు భారీగా బాసరకు తరలివచ్చారు.

చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

Next Story