High Court కు బండి సంజయ్.. అత్యవసర విచారణకు అనుమతి

by Disha Web Desk 2 |
High Court కు బండి సంజయ్.. అత్యవసర విచారణకు అనుమతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రకు వర్ధన్నపేట పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టులో ఆ పార్టీ తరఫున బంగారు శ్రుతి లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ కన్నెగంటి లలిత నేతృత్వంలోని ఐదవ బెంచ్ ముందుకు మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ పిటిషన్ విచారణకు రానున్నది. పోలీసుల ఉత్తర్వులను సవాలుచేస్తూ హౌజ్ మోషన్ పిటిషన్‌ను మంగళవారం సాయంత్రమే దాఖలు చేసినా విచారణకు న్యాయమూర్తి నిరాకరించారు. లంచ్ మోషన్ పిటిషన్ రూపంలో ఫ్రెష్‌గా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో బుధవారం ఉదయం ఈ పిటిషన్ దాఖలైంది. పాదయాత్ర ఈ నెల 27న హన్మకొండలోని భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ముగించే షెడ్యూలు ఉన్నందున యధావిధిగా కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని, పోలీసుల ఆంక్షలను ఎత్తివేసేలా డీజీపీని ఆదేశించాలని ఈ పిటిషన్‌లో బంగారు శ్రుతి విజ్ఞప్తి చేశారు.

పోలీసుల ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధబని పేర్కొన్న ఆమె రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే వర్ధన్నపేట అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ఈ ఉత్తర్వులను జారీ చేశారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పాదయాత్ర రూపంలో తెలుసుకోవడం ప్రజాస్వామిక హక్కు అని గుర్తుచేశారు. ప్రస్తుతం జరుగుతున్న థర్డ్ ఫేజ్ ప్రజా సంగ్రామ పాదయాత్రకు డీజీపీకి ముందుగానే విజ్ఞప్తి చేశామని, ఆయన కూడా మౌఖికంగా అనుమతి మంజూరు చేశారని ఆ పిటిషన్‌లో శ్రుతి గుర్తుచేశారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌కు పోలీసు భద్రత కూడా కల్పించాలని ఆమె కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే వాతావరణం ఉందని పోలీసులు లేవనెత్తిన వాదన సహేతుకంగా లేదని, ఇప్పటివరకు జరిగిన యాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు లేవని ఆమె నొక్కిచెప్పారు.

పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసి యధాతథంగా పాదయాత్ర కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆ పిటిషన్‌లో బంగారు శ్రుతి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 3.45 గంటలకు జరిగే విచారణ తర్వాత పాదయాత్రకు పోలీసుల ఆంక్షలు, తిరిగి కొనసాగే అంశాలపై హైకోర్టు నుంచి క్లారిటీ రానున్నది. ఉత్తర్వులు జారీ చేసిన వర్ధన్నపేట ఏసీపీని, వరంగల్, కరీంనగర్ పోలీసు కమిషనర్‌లు, ఇతర పోలీసు ఉన్నతాధికారులను, డీజీపీ, హోం కార్యదర్శిని ఆ పిటిషన్‌లో ఆమె ప్రతివాదులుగా పేర్కొన్నారు.


Next Story

Most Viewed