BRS, బీజేపీ ఒక్కటే అన్నవారిని చెప్పుతో కొట్టాలి: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
BRS, బీజేపీ ఒక్కటే అన్నవారిని చెప్పుతో కొట్టాలి: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని అన్నవారిని చెప్పుతో కొట్టాలని, రాహుల్ గాంధీ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆయనకు కల వచ్చిందా..? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడానికి రాహుల్‌కు సిగ్గు, శరం ఉండాలని విమర్శలు చేశారు. సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందన్నారు. రాహుల్‌కు పార్టీ నడపడం చేతకాక రాజీనామా చేసి విదేశాలకు వెళ్లి బీచ్‌లో ఎంజాయ్ చేశారని ఆయన చురకలంటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపూరిత హామీలతో డ్రామాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెడుతోందని ఆయన పేర్కొన్నారు.

కామారెడ్డి, గజ్వేల్‌లో మోడీ సభల అనంతరం కేసీఆర్ ఓటమి స్పష్టంగా అర్థమవుతోందని, గజ్వేల్‌లో ఓటమి తప్పదని అర్థమయ్యే కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డిలోనూ కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు. మజ్లీస్‌తో కలిసి బీఆర్ఎస్, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కేసీఆర్, రాహుల్ గాంధీ తలకిందులు తపస్సు చేసినా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేరని వెల్లడించారు. కేసీఆర్.. ముస్లింలకు ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని అంటున్నారని, సాఫ్ట్ వేర్ రంగంలో కూడా మతాన్ని పులమాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. బుద్ధి గడ్డి తిన్న వారికి ఇలాంటి ఆలోచనలే వస్తాయని ఎద్దేవా చేశారు.

ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే పాతబస్తీ ఎందుకు అభివృద్ధి జరగలేదని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇన్నేండ్లలో ముస్లింకు మంచి చేయకుండా ఈ రెండు పార్టీల నేతలు గాడిదలు కాశారా అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఒవైసీ బ్రదర్స్ కేసీఆర్‌ను మాము అని పిలుస్తారని, వాళ్ళు ఎలా చెబితే అలా కేసీఆర్ వింటారని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ దారుస్సలాం తాళాన్ని ఎంఐఎంకు అందించిందని ఆయన పేర్కొన్నారు. తాము మూత్రం విసర్జిస్తే ఎర్రకోట మునిగిపోతుందని ఒవైసీ అన్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందిరా గాంధీ దారుసలాంకు వెళ్లి ఎంఐఎం, తాము ఒక్కటే అనే సంకేతాలు ఇచ్చారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ 4 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే బీఆర్ఎస్ 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కబుర్లు చెబుతోందని చురకలంటించారు.

తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే కర్ణాటక ప్రజల డబ్బులతో కాంగ్రెస్ ఇక్కడ యాడ్లకు ఖర్చు పెడుతోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు చేయకపోగా ప్రజా ధనాన్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూట్ కేసుల రాజ్యం వస్తుందని, రాహుల్ గాంధీకి సూట్ కేసులు వెళ్తాయని చురకలంటించారు. రాహుల్ ఇచ్చే గ్యారెంటీలకు ఎవరు గ్యారెంటీ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్.. ఏ పార్టీ నుంచి వచ్చారో రాహుల్‌కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌కు తెలంగాణ చరిత్ర తెలుసా? అని ఆయన నిలదీశారు.

దీనిపై చర్చించేందుకు తనను ఇంటికి రమ్మన్నా సిద్ధమని, తనను ఢిల్లీకి రమ్మంటావా? అని కేంద్ర మంత్రి సవాల్ చేశారు. లేదంటే రాహుల్ హైదరాబాద్‌కు వచ్చినా ఒకే అని, అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రాహుల్ సిద్ధమా అని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని, ఆ పార్టీ నేతలే టికెట్ అమ్ముకుంటున్నారన్న విషయం రాహుల్‌కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ, గోత్రం ఒక్కటేనని ఆయన ఫైరయ్యారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా బీఆర్ఎస్ ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేయబోమని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. రైతులకు మేలు చేయాలనుకుంటే.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఎందుకు రైతుబంధు జమ చేయలేదని బీఆర్ఎస్‌పై ఆయన ఫైరయ్యారు.

హైదర్ ఎవడు? వాడెక్కడి నుంచి వచ్చాడు?

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని, అసలు హైదర్ ఎవడని, వాడెక్కడి నుంచి వచ్చాడని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్రాస్ పేరు చెన్నై, కలకత్తా పేరు కోల్‌కత, బాంబే.. ముంబై, రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్‌గా మార్చినపుడు హైదరాబాద్‌ను భాగ్యనగరంగా ఎందుకు మార్చకూడదని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే.. మేధావుల సలహాలు తీసుకుని ఇంకా పేరు మార్చాల్సిన అవసరం ఎక్కడెక్కడ ఉందో తెలుసుకుని మరీ మారుస్తామన్నారు. తప్పు చేయనప్పుడు ఐటీ, ఈడీ రైడ్ చేస్తే ఎందుకు బాధపడటమని వివేక్‌ను ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తన ఇంటిపై ఎప్పుడు, ఎవరు రెయిడ్స్‌కు వచ్చినా తాను భయపడబోనన్నారు.

తాను ఇంట్లో లేకున్నా తాళం అందిస్తామని, అందులో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మెడికల్ కాలేజీల కోసం పీఎంకు 100కు పైగా లేఖలు రాశానని కేసీఆర్ చెబుతున్నారని, ఆయన రాసిన లేఖల్లో సగం చూపించినా తాను రాజకీయ సన్యాసం చేస్తానని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. అది కూడా దొంగ లేఖలు సృష్టిస్తే కాదని, ఆన్ రికార్డ్ ఉంటే నేను రాజకీయాలు వదిలేస్తానని, లేదంటే కేసీఆర్ ఎన్నికల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. పోయే కాలంలో కూడా కేసీఆర్‌కు అబద్ధాలు ఎందుకని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా, లక్ష మంది రాహుల్ లు వచ్చినా, కోట్ల మంది ఒవైసీ లు వచ్చినా 2024లో మళ్ళీ ప్రధాని మోడీయేనని, దీన్ని ఆపడం ఎవరి తరం కాదని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

Next Story

Most Viewed