సామాన్యులకు అందుబాటులో విమాన ప్రయాణం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Dishafeatures2 |
సామాన్యులకు అందుబాటులో విమాన ప్రయాణం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సామాన్య మానవులు కూడా విమాన ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ఉడాన్ (ఉడే దేశ్‌కా ఆమ్ నాగరిక్) స్కీమ్ కోసం రూ.2,360 కోట్ల నిధులను కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌గా అందించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 1000 మార్గాల్లో టూరిజం అభివృద్ధి కోణం తో పాటు చిన్న చిన్న పట్టణాలను కలిపేందుకు ప్లానింగ్ చేయగా.. ప్రస్తుతానికి ఈ సంఖ్య 470 రూట్లలో విమానాలు నడుస్తున్నాయని, ఉడాన్ స్కీమ్ ద్వారా టూరిజం శాఖ నుంచి నిధులు అందిస్తున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడైనా టూరిజం పెరగడానికి విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ఏవియేషన్ సెక్టార్ టూరిజం, అలాగే సంస్కృతి పరస్పర మార్పిడికి వెన్నెముక లాంటిదన్నారు. ఈ విషయంలో గత ఎనిమిదన్నర ఏళ్లలో పౌర విమానయాన శాఖ ఎంతో అభివృద్ధిని సాధించిందని, ప్రపంచంలోనే భారత్ మూడో అతి పెద్ద డొమెస్టిక్ విమానయాన రంగాన్ని కలిగి ఉందని వివరించారు. కరోనా ముందు భారత సివిల్ ఏవియేషన్ సెక్టార్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంగా ఉందని.. 2014 మే లో డొమెస్టిక్ ప్రయాణికుల సంఖ్య 6 కోట్లు ఉండగా.. 2020 వరకు ఆ సంఖ్య 14.3 కోట్లకు పెరిగిందన్నారు. 2025 లోపు 220 విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ డిసెంబర్ లోపు 49 విమాన శిక్షణ సంస్థలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

భారత ప్రభుత్వం డ్రోన్ సెక్టర్ లోనూ సంస్కరణలు చేపట్టిందన్నారు. డ్రోన్ పాలసీ ద్వారా దిగుమతులపై నిషేధం విధించి దేశీయంగా డ్రోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు వందే భారత్ మిషన్ చేపట్టారు. ఆపరేషన్ రాహత్ ద్వారా యెమెన్‌లో యుద్ధం సమయంలో 4 వేల 600 మంది నర్సులను స్వదేశానికి తీసుకురావడం, ఆపరేషన్ గంగ పేరుతో కేంద్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత మెడికల్ స్టూడెంట్స్ ను తీసుకువచ్చినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కరోనా సమయంలోనూ పీపీఈ కిట్లు, మాస్కుల నుంచి అత్యవసర మందుల వరకు గమ్యస్థానాలకు చేర్చడంలో భారత విమానయాన రంగం పోషించిన పాత్ర గురించి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.


Next Story