హైదరాబాద్‌లో రఫెల్ తయారీ.. రక్షణ ఉత్పత్తి కేంద్రంగా భారత్: వివరాలు వెల్లడించిన కిషన్ రెడ్డి

by Ramesh Naini |

రఫెల్ యుద్ధ విమానాల్లో ప్రధాన భాగమైన ఫ్యూజ్‌లాజెస్ వ్యవస్థ ‌హైదరాబాద్‌లో తయారు కానుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో రఫెల్ తయారీ.. రక్షణ ఉత్పత్తి కేంద్రంగా భారత్: వివరాలు వెల్లడించిన కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Dassault Rafale) రఫెల్ యుద్ధ విమానాల్లో ప్రధాన భాగమైన ఫ్యూజ్‌లాజెస్ వ్యవస్థ ‌హైదరాబాద్‌లో తయారు కానుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా వివరాలు షేర్ చేశారు. హైదరాబాద్‌లో రఫెల్ తయారీయ అనేది ఫ్రాన్స్ బయట ఏర్పాటు చేసే తొలి కేంద్రం కావడం విశేషమని తెలిపారు. దీనివల్ల తెలంగాణలో విమాన తయారీ పరిశ్రమ విస్తరించేందుకు, దేశీయ సంస్థలు అత్యాధునిక తయారీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వీలు కలుగుతుందని వెల్లడించారు. ఫ్రెంచి సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎస్ఎల్)తో ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. దీనితో భారత్, ప్రపంచ రక్షణ ఉత్పత్తుల సరఫరా చేయిన్‌లో బలమైన స్థానాన్ని పొందనుందని తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో భారత రక్షణ ఎగుమతులు అమాంతం పెరిగాయి. 2013-14లో రూ. 686 కోట్లు నుంచి 2024-25 నాటికి రూ. 23,622 కోట్లకు చేరి, 80కి పైగా దేశాలకు మన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. భారత్ విశ్వసనీయమైన ప్రపంచ రక్షణ ఉత్పత్తి కేంద్రంగా ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం దిగుమతిదారులం కాదు.. మనమే తయారు చేస్తాం.. మనమే ఎగుమతి చేస్తాం.. అని కేంద్ర మంత్రి కొనియాడారు. ఈ మేరకు టాటా సంస్థ ఒప్పంద పత్రం ప్రకటన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

కాగా, భారత వైమానిక దళంలో కీలకంగా వ్యవహరిస్తున్న రఫేల్‌ యుద్ధవిమానాల తయారీకి సంబంధించి టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌, ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్‌ సంస్థల మధ్య తాజాగా కీలక ఒప్పందం కుదిరింది. రఫేల్‌ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్‌లో తయారు చేయాలని రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం చొరవతో హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక కంపెనీ వచ్చినట్లైంది.

Next Story