మెరుగైన కనెక్టివిటీ కోసం.. రూ.5,413 కోట్ల ప్రాజెక్టులు: కిషన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్రంలో రహదారి మౌలిక సదుపాయాల కల్పనకు అతిపెద్ద ముందడుగు పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పేర్కొన్నారు.

మెరుగైన కనెక్టివిటీ కోసం.. రూ.5,413 కోట్ల ప్రాజెక్టులు: కిషన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రహదారి మౌలిక సదుపాయాల కల్పనకు అతిపెద్ద ముందడుగు పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఈ నెల 5 వ తేదీన రూ. 5,413 కోట్ల విలువైన వివిధ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారని, భూమిపూజ చేయనున్నారని తెలిపారు. ఈ రహదారి ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, ఆర్థిక వృద్ధిని పెంపొందిస్తాయని, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని వివరించారు. దృఢమైన, భవిష్యత్ అవసరాలను తీర్చగలిగే మౌలిక సదుపాయాల కల్పన ద్వారా (Narendra Modi) నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతర సహకారాన్ని అందిస్తూనే ఉంటుందని వివరించారు.

సిర్పూర్-కాగజ్‌నగర్ ప్రాజెక్టు విలువ రూ.3,862 కోట్లు ఉంటుందని తెలిపారు. రూ.3694 కోట్ల వ్యయంతో 123 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రహదారుల ప్రారంభోత్సవం, రూ.168.47 కోట్ల వ్యయంతో 8.1 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న రహదారికి భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రాజెక్టు విలువ రూ. 1,552.91 కోట్లు అని తెలిపారు. రూ.895.64 కోట్ల వ్యయంతో 22.57 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రహాదారుల ప్రారంభోత్సం, రూ.657.27 కోట్ల వ్యయంతో 20.87 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న రహదారికి భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Next Story