కాంగ్రెస్‌ది డబుల్ గేమ్.. కాళేశ్వరం స్కామ్‌ను వదిలిపెట్టం: బండి సంజయ్

by Vemula.Srinu Prasad |

కాంగ్రెస్‌ది డబుల్ గేమ్ అని, కాళేశ్వరం స్కామ్‌ను వదిలిపెట్టమని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు...

కాంగ్రెస్‌ది డబుల్ గేమ్.. కాళేశ్వరం స్కామ్‌ను వదిలిపెట్టం: బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కాం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంగీకరించిందన్నారు. కాళేశ్వరం విచారణ విషయంలో కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. అసెంబ్లీలో సీబీఐ విచారణ చేయాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం... హైకోర్టులో మాత్రం సరైన వాదనలు విన్పించకుండా బీఆర్ఎస్‌కు రిలీఫ్ వచ్చేలా చేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన స్కాంల విషయంలో ఎడతెరిపి లేని విచారణలతో జాప్యం చేస్తూ దోషులు తప్పించుకునేలా చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై నివేదిక వచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశంతోపాటు ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసు, గొర్రెల స్కాం కేసులను సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

‘‘కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని మొట్టమొదట డిమాండ్ చేసింది నేనే. 20 నెలలుగా విచారణ చేయకుండా కేసును నీరుగార్చిన చరిత్ర కాంగ్రెస్ దే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో సంబంధం లేకుండా ఎందుకు సీబీఐ విచారణ జరపాలని లేఖ రాయడం లేదు?. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు, అధికారుల ఇండ్లపై దాడుల్లో వందల, వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి... జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్యలేవి?. యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ఏటీఆర్) ఏది?. సీబీఐకి ఇచ్చి చేతులు దులుపుకుని కోర్టులో సరైన వాదనలు విన్పించకుండా కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాలనే కుట్రలు చేస్తారా?. కాళేశ్వరంపై వాదనలు విన్పించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. కాళేశ్వరం అవినీతి, అక్రమాలపై నేరుగా ఆధారాలు చూపుతూ సీబీఐ విచారణ కోసం లేఖ రాస్తే హైకోర్టులో కేసీఆర్ కు రిలీఫ్ వచ్చేదే కాదు... అట్లా రాయకుండా రెండేండ్లుగా ఎందుకు జాప్యం చేసి కేసును నీరుగార్చారు. ఏదేమైనా కాళేశ్వరం స్కాం బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.’’ అని బండి సంజయ్ హెచ్చరించారు.

Next Story