ప్రజాక్షేత్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్..

by Taduka Kalyani |

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రజాక్షేత్రంలో పర్యటించారు.

ప్రజాక్షేత్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్..
X

దిశ, హుస్నాబాద్: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రజాక్షేత్రంలో పర్యటించారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో పర్యటించిన అనంతరం, ఆయన కరీంనగర్ వైపు వెళ్లేందుకు స్థానిక ఆటోలో ఎక్కారు. ప్రయాణంలో భాగంగా ఆటో డ్రైవర్ దిలీప్‌తో ముచ్చటిస్తూ మోదీ పాలనపై ఆయన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. "ఉచిత బియ్యం, గ్యాస్, రోడ్లు, గ్రామాభివృద్ధికి నిధులు ఇలా మోదీ పాలన పేదలకు ఎంతో మేలు చేస్తోంది" అని డ్రైవర్ పేర్కొనగా, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సైతం బండి సంజయ్ ఆరా తీశారు.

పాఠశాల ఆవరణలో ‘టిఫిన్ బైఠక్’

అంతకుముందు రేకొండ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన బండి సంజయ్, ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు, కార్యకర్తలతో కలిసి పాఠశాల ఆవరణలో ‘టిఫిన్ బైఠక్’ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా బడులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తాను ఇంటి నుంచి తెచ్చుకున్న సద్ది మూటను విప్పి, అందరితో కలిసి నేల మీద కూర్చుని అల్పాహారం చేయడం స్థానికులను ఆకట్టుకుంది.

అభివృద్ధికి భరోసా

పాఠశాల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి, విద్యార్థుల డైనింగ్ కోసం రూ.5 లక్షలు, ప్రాథమిక పాఠశాల గదులు, కుల సంఘాల భవన నిర్మాణాలకు రూ.20 లక్షలు.. మొత్తంగా రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. కేంద్రం పిలుపు మేరకు రేపు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ‘స్వచ్ఛ పాఠశాల’ నిర్వహించనున్నట్లు, సిరిసిల్లలో తాను స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story