బ్రేకింగ్: కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్

by Disha Web Desk 19 |
Amit Shah
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 12వ తేదీన తెలంగాణకు రానున్నారు. హకీంపేటలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆపై సంగారెడ్డిలో నిర్వహించే మేధావుల సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. గతంలో ఎన్నడూ లేనిది రచయితలు, కవులు, డాక్టర్లు, ఇంజినీర్లు, పలు రంగాలకు చెందిన మేధావులతో భేటీ కావడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టిసారించిన నాటి నుంచి ప్రతి నెలా ఒకసారి రాష్ట్రంలో పర్యటిస్తానని అమిత్ షా గతంలోనే క్లారిటీ ఇచ్చారు.

అయితే పలు కారణాలతో ఇది వాయిదా పడింది. గతంలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో లేదా ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పర్యటన కొనసాగిస్తారని చెప్పినప్పటికీ ఈ కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. గతనెల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన షా బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయి సంస్థాగత బలోపేతంపై దిశానిర్దేశం చేసి వెళ్లారు. కాగా ఈసారి సైతం ఇంకెలాంటి అంశాలపై ఆయన నేతలతో చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులంతా హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి వచ్చారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. కాగా ఈసారి ఏకంగా మేధావుల సదస్సులో పాల్గొననుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు తెలంగాణకు కేటాయించడం లేదని కేంద్రంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల కేటాయింపుతో పాటు రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్న తీరుపై షా ప్రస్తావించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అయితే తొలుత హకీంపేటలో అధికారిక సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన సంగారెడ్డి మేధావుల సదస్సుకు హాజరుకానున్నారు. అనంతరం కర్ణాటకకు వెళ్లనున్నారు. బీదర్‌లో నిర్వహించనున్ను పలు కార్యక్రమాలకు అమిత్ షా హాజరుకానున్నారు.

Next Story

Most Viewed