తెలంగాణలో యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ రూపకల్పన.. హెచ్ఎండీఏ కమిషనర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ రూపకల్పనలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకమని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు.

తెలంగాణలో యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ రూపకల్పన.. హెచ్ఎండీఏ కమిషనర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ (UDBC) రూపకల్పనలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకమని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ (HMDA Commissioner Sarfaraz Ahmed) అన్నారు. పట్టణాభివృద్ధి కోసం నియంత్రణ వ్యవస్థను ఏకీకృతం చేయడం, బలోపేతం చేయడానికి బిల్డింగ్ కోడ్ ఉపయోగపడుతుందన్నారు. బిల్డింగ్ కోడ్ రూపకల్పన చేసే బాధ్యతలను ఎర్న్‌స్ట్, యంగ్ (ఈవై) సంస్థ కన్సల్టెంట్లుగా నియమించామని తెలిపారు. తెలంగాణలో అమలులో ఉన్న విధానాలను ఇతర జాతీయ, అంతర్జాతీయ కేస్ స్టడీలతో పోల్చుతూ సమగ్ర సమీక్ష నిర్వహించిందని, వారి పరిశీలనలు, గమనికలు, ఉత్తమ పద్ధతులు యూనిఫైడ్ కోడ్ ముసాయిదాను రూపొందించినట్లు చెప్పారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) నగరంలోని పార్క్ హయత్ ప్యాలెస్ లో మంగళశారం ‘స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్ వర్క్‌షాప్’ను నిర్వహించాయి. ఈ వేదికలో ప్రభుత్వ విభాగాలు, పలు ప్రయివేటు సంస్థలు నుంచి సూచనలు, అభిప్రాయాలు సేకరించారు. సలహాలు, చర్చలు అన్నీ నమోదు చేసి,యూడీబీసీ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఈ సందర్భంగా హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ యూనిఫైడ్ కోడ్ తయారీలో ప్రతి ఒక్కరి నిర్మాణాత్మక భాగస్వామ్యం ఎంత ముఖ్యమో హైలైట్ చేశారు. సస్టైనబిలిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ), ఇన్‌క్లూజివిటీ అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ యూడీబీసీ దేశంలోనే తొలిసారి ప్రవేశపెట్టే రూపకల్పన అవుతుందని ఆయన వివరించారు. ఈ కోడ్స్ రాష్ట్రంలో బలమైన, భవిష్యత్‌ దృష్టితో కూడినవిగా నిలుస్తాయని అన్నారు. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల సుస్థిరమైన, సమగ్ర అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తుందన్నారు. విభిన్న శాఖలు, అర్బన్ ప్లానర్లు, పరిశ్రమ భాగస్వాములు, డెవలప్‌మెంట్ ఫోరమ్‌ల నుండి వచ్చిన సహకారం నియమాలను సరళమైనవిగాను, పారదర్శకమైనవిగాను, కాలానుగుణంగా మార్పులు చెందగలవిగాను మలచడానికి పునాదిగా పని చేస్తుందని వివరించారు. ఈ వర్క్‌షాప్‌లో జీహెచ్ఎంసీ, సీడీఎంఏ, జలమండలి, విద్యుత్ శాఖ, మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డ్, హైడ్రా, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, డీటీసీపీ వంటి కీలక శాఖల ప్రతినిధులు పాల్గొని విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సెషన్‌ను డీటీసీపీ డైరెక్టర్ ఎస్.దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారుల సూచనలు విలువైనవని అన్నారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ : నియమాలను సులభతరం చేయడం, శాఖల మధ్య మెరుగైన సమన్వయం అవసరం.

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి కమిషనర్ : నియమాలు సులభంగా అర్థమయ్యేలా, గ్రామీణ-పట్టణ ప్రాంతాలన్నిటికీ సమానంగా అమలయ్యేలా ఉండాలి.

జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ : నీటి ఫీజిబిలిటీ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో జారీ అవుతున్నాయి. వీటిని బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయడం జరుగుతోంది.

ఎంఆర్డీసీఎల్ ఎండీ : మూసీ నది పునరుజ్జీవన పనులు త్వరలో ప్రారంభం అవుతాయి. ప్రత్యేక పారిశ్రామిక పార్కుల ప్రణాళిక అవసరం.

హైడ్రా కమిషనర్ : నాలాలు, చెరువులు పక్కన ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదల అవుతాయి.

జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు: మాస్టర్ ప్లాన్ మరింత సౌలభ్యంగా ఉండాలి. భవనాల ఎత్తు పెంచే అనుమతులు, భూ వినియోగ వర్గీకరణను జియోకోఆర్డినేట్ల ద్వారా గుర్తించే విధానం ఉండాలి.

వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి : ప్రైవేటు సంస్థలు

కొత్త నియమాలు వినియోగదారుకు అనుకూలంగా ఉండాని ప్రైవేట్ స్టేక్‌హోల్డర్లు (క్రెడాయ్, నరెడ్కో, ఐటీపీఐ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, సీఐఐ, టీబీఎఫ్, ఐజీబీసీ) కోరారు. ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులను సవరించాలన్నారు. లేఅవుట్లలో అదనపు భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం తప్పనిసరి కేటాయించడం, విద్యుత్ శాఖలు విధిస్తున్న అదనపు భూ అవసరాలు అభివృద్ధి దారులపై భారమవుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Next Story