కాంగ్రెస్‌లోకి తుమ్మల.. ఆ నియోజకవర్గంపై భారీ ఎఫెక్ట్!

by Disha Web Desk 4 |
కాంగ్రెస్‌లోకి తుమ్మల.. ఆ నియోజకవర్గంపై భారీ ఎఫెక్ట్!
X

దిశ, దమ్మపేట: కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరనున్నారు. ఈనెల 16,17 తేదీలలో కాంగ్రెస్ పార్టీలోకి ఆయన చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లోని తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటితో పాటు పలువురు రాష్ట్ర నాయకులు తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా తుమ్మల వారికి సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రేపు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో గాని,17న హైదరాబాద్ తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ విజయభేరి సభలో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

మౌనంగా ముఖ్య అనుచరులు

బీఆర్ఎస్ పార్టీ నుంచి పాలేరు టికెట్ ఆశించి బంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి తుమ్మల స్వగ్రామం దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు వచ్చి కలుస్తున్నారు. కానీ తుమ్మల ముఖ్య అనుచరులుగా భావించే కొంతమంది నాయకులు మాత్రం తుమ్మల ఇంటికి వెళ్లలేదు. అల్లిపల్లిలో ఏర్పాటు చేసిన తుమ్మల అభిమానుల ఆత్మీయ సమావేశంలో మాత్రం తాము కూడా నడుస్తామని ముఖ్య అనుచరులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ అనుచరులు మాత్రం కాంగ్రెస్ పార్టీలో తుమ్మలతో కలసి చేరేందుకు సుముఖంగా లేరని ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని ప్రచారం.

అశ్వారావుపేటపై ప్రభావం

తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ ప్రభావం అశ్వారావుపేట నియోజకవర్గంపై చూపుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. తుమ్మలకు చెందిన సామాజిక వర్గం ఆయనతోనే కలిసి నడవనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా తాను మంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలుగా లబ్ధి పొందిన అనుచరగలమంతా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని తుమ్మల కోరినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే వీరంతా ప్రస్తుతం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుకు బలం బలగంగా కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుకు సహకరిస్తారా..? లేదా గత 40ఏళ్లుగా తుమ్మల అనుచరులుగా పేరు మోస్తున్న వారు మళ్లీ అదే పల్లకీని మోస్తారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Next Story