తిరుమల లడ్డూ ప్రసాదంలో చాలా మార్పులొచ్చాయి : టీటీడీ ఛైర్మన్ BR నాయుడు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-05 12:45:16  IST  )

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో చాలా మార్పులు వచ్చాయని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.

తిరుమల లడ్డూ ప్రసాదంలో చాలా మార్పులొచ్చాయి : టీటీడీ ఛైర్మన్ BR నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమలగిరులపై కొలువై ఉన్న దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రతను మరింత పెంచాలని బోర్డు నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఆయన టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాదికాలం పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో చాలా మార్పులు వచ్చాయని, ప్రసాదం 10 రోజులపాటు నిల్వ ఉన్నా ఎలాంటి చెడు వాసన రావడం లేదని భక్తులు చెబుతున్నారన్నారు. అలాగే అన్నప్రసాదాలను కూడా నాణ్యమైన పదార్థాలతో తయారు చేస్తున్నామని, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు.

ఇక తిరుపతి నివాసితులకు ప్రతినెలా తొలి మంగళవారం 3 వేలమందికి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాటేజీలకు గతంలో సొంతపేర్లు పెట్టుకోగా.. ఇప్పుడు వాటిని తొలగించి దేవుడి పేర్లనే పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దవుతుందన్న ప్రచారంపై ఆయన స్పందించారు. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేయబోమని స్పష్టం చేశారు.

తిరుపతి ఎయిర్ పోర్టు పేరు మార్పు?

తిరుపతి ఎయిర్ పోర్టు పేరును శ్రీ వెంకటేశ్వర ఎయిర్ పోర్టుగా మార్చేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల, ఒంటిమిట్ట క్షేత్రాల్లో ఔషధ, పవిత్రవనాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలోని కరీంనగర్, దుబ్బాక, మంథనిలలో టీటీడీ ఆలయాలను నిర్మిస్తామని చెప్పారు.

టీటీడీ కొనుగోళ్ల విభాగంలో అవకతవకలపై స్పందించిన ఛైర్మన్ బీఆర్ నాయుడు.. దానిపై ఏసీబీ విచారణ జరుగుతుందన్నారు. తిరుమలపై అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story