TS: ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో స్వల్ప మార్పులు!

by Disha Web Desk 2 |
TS: ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో స్వల్ప మార్పులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఐ, కానిస్టేబుల్‌‌లోని వివిధ పోస్టులకు కలిపి దేహదారుడ్య (పీఎంటీ, పీఈటీ)ల కోసం 2,37,862 మంది అభ్యర్థులు పార్ట్‌-2 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఫీజికల్ ఈవెంట్ల ప్రక్రియ వీలైనంత మేరకు సాంకేతిక పరికరాలతోనే నిర్వహిస్తున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా ఈవెంట్స్ ప్రక్రియ పూర్తి చేసేలా సాంకేతికతను వినియోగించనున్నామని వివరించారు. బయోమెట్రిక్‌ పరికరాలు, ఎత్తును కొలిచేందుకు డిజిటల్‌ మీటర్ల వాడకం, సీసీటీవీ కెమెరాలు సహా ఇతర సాంకేతిక సామగ్రిని ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహణ తేదీకి వారం రోజుల ముందే అన్ని కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి పనితీరు సంతృప్తికరంగా ఉందా లేదా అన్నది ముందుగానే నిర్ధారించుకోనున్నట్లు, ఆ మైదానాల్లో ఇంటర్‌నెట్ కూడా ఉందని అధికారులు తెలిపారు.

డిసెంబర్ 8 నుంచి ఫిజికల్ ఈవెంట్స్

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా చేపట్టే ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్ నిర్వాహణపై టీఎస్ఎల్పీఆర్బీ ఆదివారం కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 8 నుంచి దేహదారుడ్య పరీక్షలు(పీఎంటీ, పీఈటీ టెస్టులు) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈవెంట్స్ ఉంటాయని తెలిపింది. ఈ ప్రాసెస్ 23 నుంచి 25 రోజుల్లో (జనవరిలోపు) పూర్తవుతుందని పేర్కొంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ అర్ధరాత్రి వరకు అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.in ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఈవెంట్స్ అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌‌లో అవ్వకపోతే అభ్యర్థులు [email protected]కు ఈ-మెయిల్‌ చేయవచ్చని, లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చని బోర్డు ప్రకటించింది.

దేహదారుడ్య పరీక్ష కేంద్రాలు ఇవే..

రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో దేహదారుడ్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బోర్డు తెలిపింది. హైదరాబాద్‌ వారికి అంబర్ పేట పోలీస్ గ్రౌండ్స్, సైబరాబాద్‌ అభ్యర్థులకు 8వ బెటాలియన్ కొండాపూర్, రాచకొండ కమిషనరేట్ పరిది వారికి సరూర్ నగర్ స్టేడియం, వరంగల్‌ జిల్లా వారికి హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం, కరీంనగర్‌ జిల్లాలో సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం, ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్, మహబూబ్‌నగర్‌ జిల్లాకు డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్, నల్లగొండ వారికి మేకల అభినవ్ స్టేడియం, సంగారెడ్డి అభ్యర్ధులకు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్, ఆదిలాబాద్‌ వారికి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్, నిజామాబాద్‌ అభ్యర్థులకు రాజారాం స్టేడియం, నాగారంలో ఫీజికల్ ఈవెంట్స్‌ నిర్వహిస్తునట్లు వెల్లడించింది. అభ్యర్థుల సంఖ్యను బట్టి భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేటలోని పోలీస్ గ్రౌండ్‌లో ప్రయోగాత్మకంగా పీఎంటీ, పీఈటీ టెస్టులు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.

ఈవెంట్స్ నిర్వహించే విధానం

పోలీస్ అభ్యర్థులు వెరిఫికేషన్ సమయంలో తమవెంట అడ్మిట్ కార్డు, పార్టు అప్లికేషన్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పీపీఓ/డిస్‌చార్జ్ బుక్/ నో అబ్జేక్షన్ సర్టీఫికేట్ తీసకురావాలి. ఏజెన్సీ ఏరియా వారు బోర్డు సూచించిన లోకల్ షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. ముందుగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నేరుగా పురుషులకు 1600 మీటర్ల రన్నింగ్, మహిళలకు 800 మీటర్ల రన్నింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎత్తు కొలిచే ప్రక్రియ ఉంటుందని తర్వాత, ఎత్తు కొలిచే టప్పుడు 1 సెంటీమీటర్ తక్కువగా వచ్చే వారికి మరో సారీ ఎత్తు కొలిచేందుకు అవకాశం కూడా ఉంటుందని బోర్డు అధికారులు తెలిపారు. ఈ రన్నింగ్, హైట్(బోర్డు సూచించిన ఎత్తు) విషయంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు మిగితా ఈవెంట్లయిన లాంగ్ జంప్, షాట్‌పుట్ పోటీలు నిర్వహిస్తామని బోర్డు అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed