టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీలో బీజేపీని ఇరుకున పెట్టే కుట్ర!

by Disha Web Desk 2 |
టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీలో బీజేపీని ఇరుకున పెట్టే కుట్ర!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఫోకస్ షిప్ట్ అవుతున్నది. నిన్నమొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ సభ్యులే. కానీ, ఈసారి మాత్రం బీజేపీ సభ్యులపైకి బాణాన్ని ఎక్కు పెట్టాలనుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని కార్నర్ చేయాలనుకుంటున్నది. గవర్నర్ ప్రసంగం విషయంలో ఎలాగూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అధికార పార్టీని తప్పుపట్టాలని నిర్ణయించుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ విమర్శించాలనుకుంటున్నాయి. దీన్ని పసిగట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగానే కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. గవర్నర్ వ్యవస్థనే ప్రశ్నించడం ద్వారా బీజేపీని ఇరుకున పెట్టవచ్చని భావిస్తున్నారు. మోడీ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించుకోడానికి అసెంబ్లీని కూడా వేదికగా వాడుకోవాలని టీఆర్ఎస్ అనుకుంటున్నది.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత వ్యూహం మార్చుకున్న టీఆర్ఎస్‌ ఈ సమావేశాల నుంచే దూకుడు పెంచాలనుకుంటున్నది. సమావేశాలు జరిగే టైమ్‌లోనే ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వాటిని కూడా సందర్భానుసారం వాడుకుని పరిస్థితికి అనుగుణంగా బీజేపీపై విమర్శించాలన్న వ్యూహం దాదాపు ఖరారైనట్లు గులాబీ వర్గాల సమాచారం. కేవలం ముగ్గురు మాత్రమే బీజేపీ సభ్యులు ఉన్నందున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడా తగ్గేదే లే అనే తీరులో సరిగ్గా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన ఉదాహరణలను, సంఘటనలను ఇప్పటికే రెడీ చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కంటే బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అనే అభిప్రాయం మొత్తం దేశానికి వెళ్ళేలా ఈ సమావేశాల్లో టీఆర్ఎస్ వ్యవహరించనున్నది.

ప్రతిపక్ష స్థానంలో ఈటల రాజేందర్

హుజూరాబాద్ ఫలితాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోయింది. అప్పటి నుంచే బీజేపీ వ్యతిరేక వైఖరి మొదలైంది. ఇంతకాలం మంత్రి హోదాలో అసెంబ్లీలో అధికార పార్టీ స్థానంలో కూర్చున్న ఈటల రాజేందర్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో కనిపించనున్నారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసినందున ఇప్పుడు బడ్జెట్‌పై బీజేపీ తరఫున చర్చలో ఈయనే పాల్గొంటున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి హరీశ్‌రావు, చర్చల సందర్భంగా అవసరమైతే జోక్యం చేసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ దీర్ఘకాలంగా ఈటల రాజేందర్‌తో సన్నిహితంగా ఉన్నవారే.

ఇంతకాలం ప్రభుత్వ పథకాలను ప్రశంసించి స్వంతం చేసుకున్న ఈటల ఇప్పుడు ఎండగట్టే పాత్రను పోషించబోతున్నారు. ఆయన చేసే కామెంట్లను గట్టిగా తిప్పికొట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అవసరమైతే గతంలో ఇదే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అభినందించిన అంశాలను తేదీలతో సహా గుర్తుచేసి ఈటల నోరు మూయించాలనే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ బడ్జెట్‌ను బీజేపీ సభ్యులు తప్పుపట్టే ప్రయత్నం చేస్తే దానికి కౌంటర్‌గా కేంద్ర బడ్జెట్‌లో ఏమిచ్చిందో ఉదాహరణలతో సహా వివరించి దోషిగా నిలబెట్టడంపైనా కసరత్తు జరుగుతున్నది. సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను విమర్శించే అర్హత బీజేపీకి లేదనే ముగింపును ఇవ్వాలనుకుంటున్నది టీఆర్ఎస్.

కాంగ్రెస్‌పై తగ్గనున్న విమర్శలు

టీఆర్ఎస్ పార్టీ వ్యూహం ప్రకారం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్‌ను కార్నర్ చేయకపోవచ్చని సమాచారం. ఇప్పటివరకు జరిగిన అన్ని అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా 'ఇదంతా మీ పాపమే గదా.. మీకు తెలివి ఉంటే కల్యాణలక్ష్మి, రైతుబంధు లాంటి పథకాలను పెట్టలేదెందుకు?..' అంటూ తనదైన శైలిలో తిప్పికొట్టారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం కాంగ్రెస్ పార్టీ పుణ్యమేగదా అంటూ సెటైర్లు కూడా వేశారు. ఇప్పుడు ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీపైన చేయకపోవచ్చనే వార్తలు టీఆర్ఎస్ వైపు నుంచి వినిపిస్తున్నాయి. ప్రధాన ఫోకస్ బీజేపీ మీదకు పెట్టడం ద్వారా ప్రధాన ప్రత్యర్థి ఆ పార్టీ మాత్రమే అనే ఇమేజ్‌ క్రియేట్ చేయాలనుకుంటున్నది.

జాతీయ రాజకీయాల్లో యాంటీ బీజేపీ వైఖరి తీసుకున్నందువల్ల రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి కాషాయ పార్టీ సభ్యులు ఏదైనా విమర్శ చేస్తే తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష, కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో కోత, సంక్షేమ రంగాన్ని విస్మరించడం, చివరకు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా కేటాయింపులను తగ్గించడం, కరోనా టైమ్‌లో పేదలు వైద్యం కోసం సర్వం అమ్ముకున్నా వైద్య రంగానికి నిధులు కేటాయించకపోవడం.. ఇలాంటి అనేక అంశాలను ప్రస్తావించి బీజేపీని నోరెత్తుకుండా చేయాలని టీఆర్ఎస్ ముందస్తు వ్యూహాన్ని రూపొందించుకున్నది. ఈటల రాజేందర్‌ను పార్టీపరంగా, వ్యక్తిగతంగా డీమోరల్ చేయడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విరుచుకుపడే అవకాశం ఉన్నది.


Next Story

Most Viewed