రాహుల్​ నాయకత్వమే కావాలంటూ TPCC తీర్మానం

by Disha Web Desk 2 |
రాహుల్​ నాయకత్వమే కావాలంటూ TPCC తీర్మానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ, టీపీసీసీ ఎన్నిక కోసం రాష్ట్రం నుంచి 270 ప్రతినిధులను నియామకం చేశారు. వీరందరినీ నియమిస్తున్నట్లుగా టీపీసీసీ చీఫ్​రేవంత్​ రెడ్డి ప్రకటించారు. నూతన ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఏఐసీసీ అధ్యక్షుడుగా ఎన్నిక కావాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టగా టీపీసీసీ విస్తృత స్థాయి మీటింగ్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆ తీర్మానాన్ని బలపరిచారు. మండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీఆర్​అలీ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ తీర్మానాన్ని బలపరిచారు. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు రాహుల్​గాంధీని ఏఐసీసీ చీఫ్‌గా నియమించాలనే తీర్మానాన్ని బలపరిచారు. అనంతరం టీపీసీసీ పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటును కూడా సోనియా గాంధీకి అప్పగిస్తూ తీర్మానం చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు కమిటీ ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ విద్వేషాన్ని నింపుతోందన్నారు. దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని, ప్రస్తుతం దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉందన్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశాన్ని కాపాడేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని రేవంత్ పేర్కొన్నారు.

టీపీసీసీ జనరల్ బాడీ మీటింగ్

నాంపల్లి రోజ్ గార్డెన్‌లో టీపీసీసీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు ఏఐసీసీ సెక్రెటరీ బోసు రాజు, నదీమ్ జావేద్, ఎంపీ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మెన్ మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, పీసీసీ నేతలు, డీసీసీ ప్రెసిడెంట్లు హాజరయ్యారు.

ప్రతినిధుల్లో డీసీసీ చీఫ్‌లు

టీపీసీసీ, ఏఐసీసీ ఎన్నిక కోసం ప్రతినిధుల బృందంలో అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు స్థానం కల్పించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరిని ఎంపిక చేశారు. అదనంగా 15 శాతం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు. దీంతో ఈ సంఖ్య 272కి చేరింది.

హన్మంతన్నా..

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్​మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. నాంపల్లిలో రోజ్ గార్డెన్‌లో సమావేశం అనంతరం రేవంత్ గాంధీభవన్‌కు వస్తుండగా.. అప్పటికే హన్మంతరావు గేటు దగ్గర ఉన్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఉన్నపళంగా కారు దిగి హన్మంతరావు దగ్గరకు వెళ్లారు. సమావేశం ప్రశాంతంగా జరిగిందని హన్మంతరావు అనడంతో.. అంతా మీ దయ అంటూ రేవంత్​ చెప్పడం ఆసక్తిగా మారింది.


Next Story

Most Viewed