క్వారీల పేరుతో ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

by Dishafeatures2 |
క్వారీల పేరుతో ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X

దిశ, జమ్మికుంట: క్వారీల పేరుతో ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం జమ్మికుంట మండలం తనుగుల ఇసుక క్వారీని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలకు చూపెట్టానికి తాను ఇక్కడకు వచ్చానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా కొంతమంది మాఫియాగా తయారై ఇసుక దందాకు తెరలేపారని మండిపడ్డారు.

అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదు చేసినవాళ్లపై దాడులకు పాల్పడుతున్నారని, ఫిర్యాదు చేస్తే ప్రభుత్వంలోని పెద్దలు గానీ, అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానేరు వాగులో ఇసుక దందా ఇలాగే కొనసాగితే వాగు భవిష్యత్తులో ఎడారిలా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా వల్లే కాళేశ్వరం కొట్టుకుపోయిందని అన్నారు. ఈ ఇసుక దందాలో సీఎం కేసీఆర్ కుటుంబానికి వాటా ఉందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు జోగినపల్లి సంతోష్, జోగినపల్లి రవీందర్ రావు అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఇసుక మాఫియా, గనుల మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాటం చేస్తూనే ఉంటుందని రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రతో కేసీఆర్ లో వణుకు మొదలైందని, అందుకే తమ యాత్రను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దాడులకు భయపడబోదని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అక్రమార్కుల పని పడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ , హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ బల్మూరి వెంకట్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed