ఆ దృశ్యం చూసి ఏడుపొచ్చింది.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

by Dishafeatures2 |
ఆ దృశ్యం చూసి ఏడుపొచ్చింది.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: సూరత్ కోర్టు తీర్పుతో ఎంపీ పదవిని కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ లో తనకు కేటాయించిన అధికార నివాసాన్ని శనివారం (ఏప్రిల్ 22) ఖాళీ చేశారు. తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి అధికార నివాసానికి వెళ్లిన రాహుల్.. ఇంటిలోని లైట్లను, ఫ్యాన్లను స్వయంగా తానే బంద్ చేశారు. అనంతరం బంగ్లాకు తాళం వేసి ఆ తాళంచెవిని లోక్ సభ సెక్రటరీకి అందజేశారు. అక్కడి నుంచి నేరుగా తన తల్లి నివాసమైన జన్ పథ్ కు వెళ్లారు. కాగా రాహుల్ ఇల్లు ఖాళీ చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పదించారు.

గొప్ప వారసత్వ చరిత్ర, తమ త్యాగాలతో ఈ దేశాన్ని నిర్మించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కక్షగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆయనను కుట్రపూరితంగా ఎంపీ పదవికి.. ఆ తర్వాత అధికార నివాసానికి దూరం చేశారని ఆరోపించారు. ‘‘ఢిల్లీలోని అధికార నివాసం నుంచి కట్టుబట్టలతో రాహుల్ గాంధీని బయటకు పంపిన దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి.. గుండెలు బరువెక్కుతాయి’’ అని రేవంత్ అన్నారు. ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చే సమయంలో రాహుల్ గాంధీ చాలా హుందాగా, ఆదర్శవంతంగా వ్యవహరించారని తెలిపారు. ఇంటిని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పజెప్పి బయటకు వెళ్లిన తీరుతో రాహుల్ గాంధీ భారతీయ ఆత్మకు మరింత చేరువయ్యారని అన్నారు.

Next Story

Most Viewed