నేను సంతకం పెడితేనే కాంగ్రెస్‌లో అభ్యర్థులకు టికెట్లు

by Disha Web Desk 2 |
నేను సంతకం పెడితేనే కాంగ్రెస్‌లో అభ్యర్థులకు టికెట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు తాను సంతకం పెడితేనే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తనను టీపీసీసీ చీఫ్‌గా నియమించి, ఇలాంటి గొప్ప అవకాశాన్ని కొడంగల్ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కల్పించారన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలానికి చెందిన సుమారు 60 మంది యువకులు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మద్దూరు మండలంలో తాగునీరు, రోడ్లు, విద్య, విద్యుత్ సదుపాయాలను తన హయాంలోనే కల్పించామని ఈ సందర్భంగా చెప్పారు. రేవంత్ రెడ్డికి పేరు వస్తుందేమోనని కేసీఆర్, మోడీ కలిసి కృష్ణా–వికారాబాద్ రైలును కొడంగల్‌కు రాకుండా ఆపారని ఆరోపించారు. గత నాలుగేళ్లలో కొడంగల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప.. ప్రస్తుత ఎమ్మెల్యే చేసింది శూన్యమని, కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి టీఆర్ఎస్ను గెలిపిస్తే ఏం జరిగిందో చూశారని నియోజకవర్గ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, పోలీస్స్టేషన్లు పైరవీకారులకు అడ్డాగా మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో కొడంగల్ గౌరవం ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించుకోవాలని, గ్రామాల్లో 5 వేల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఎన్నో సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.



Next Story

Most Viewed