సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌.. టీపీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్‌ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

పంచాయతీ ఎన్నికల తొలి విడతలో కాంగ్రెస్‌ మద్దతుదారులైన అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్​మహేష్‌ కుమార్‌ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌.. టీపీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్‌ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పంచాయతీ ఎన్నికల తొలి విడతలో కాంగ్రెస్‌ మద్దతుదారులైన అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్​మహేష్‌ కుమార్‌ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మొదటి విడత సర్పంచ్‌ ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ అనుబంధ అభ్యర్థులే గెలవడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అద్దం పట్టే ఈ ఫలితాలు, ప్రభుత్వంపై వారి అపార నమ్మకాన్ని తిరిగి చాటుతున్నాయని మహేష్‌ కుమార్‌ గౌడ్ అభిప్రాయపడ్డారు. సర్పంచ్‌ ఎన్నికల తొలి విడత ఫలితాలు, ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై గ్రామీణ స్థాయిలో ఏర్పడిన అనుకూల వాతావరణానికి అద్దం పడుతున్నాయని, ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు తెలంగాణలో కాంగ్రెస్‌ బలోపేతానికి మార్గదర్శకమన్నారు. నిరంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలను సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకు ప్రచార వ్యూహాలు రూపొందించి అమలు చేసిన విధానమే ఈ విజయానికి ప్రధాన కారణమని మహేష్‌ కుమార్‌ గౌడ్ తెలిపారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో, ప్రజలను నేరుగా కలవడం తమ పార్టీకి మరింత అనుకూలంగా మారిందన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రెండు సంవత్సరాల ప్రజాపాలన సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని, తమ పాలన పట్ల ప్రజల సంతృప్తి పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించిందని టీపీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి, మంత్రులు గ్రామస్థాయి సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేశారని, గ్రామీణ ఓటర్లలో కాంగ్రెస్‌పై విశ్వాసం పెరిగేందుకు కారణమైందని ఆయన చెప్పారు. సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి నినాదానికి ప్రజలు పట్టం కట్టారని, సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఘన విజయమే దీనికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత విస్తృతంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, గ్రామ పాలనా వ్యవస్థలో నూతన దిశకు సంకేతం ఆయన వ్యాఖ్యానించారు.

పంచాయతీ ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించిందని, నూతన తెలంగాణ రాజకీయ సంస్కృతికి సంకేతమని మహేష్‌ కుమార్‌ గౌడ్ స్పష్టం చేశారు. ఈ విజయం పార్టీకి మరింత బాధ్యతను పెంచిందని, గ్రామీణాభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రాధాన్యత కేంద్రంగా మార్చే దిశగా తాము ముందుకు సాగుతామన్నారు

Next Story