రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. మరమ్మతుల పేరుతో పవర కట్!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది.

రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. మరమ్మతుల పేరుతో పవర కట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. మరమ్మతుల పేరిట గంటల తరబడి కరెంట్ కట్ చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలతోపాటు రాజధాని నగరంలోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నది. మరమ్మతుల పేరుతో ఆదివారం అనేక చోట్ల ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు నుంచి మూడు గంటల పాటు కరెంట్ తీసేశారు. బోయిన్ పల్లి డివిజన్ పరిధిలో చెట్ల కొమ్మల కత్తిరింపు, ఫీడర్ల నిర్వహణ, ఏబీ స్విచ్ మరమ్మతులు, మిడిల్ ఫేజ్ రైజర్ ఎరెక్షన్ వంటి మరమ్మతులు చేస్తున్నారు. దీంతో డివిజన్ పరిధిలో ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు ప్రకటన చేసి కరెంట్ కట్ చేశారు. తిరుమలగిరి ఏరియాలోని కానాజీగూడ పరిధిలోని తిరుమలనగర్, గ్రీన్ ఫీల్డ్కాలనీ, కానాజీగూడ, సాయి నగర్, భూదేవీ నగర్, మడ్ ఫోర్ట్ రోడ్, సమతానగర్ లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కళింగ ఎన్ క్లేవ్, నాగిరెడ్డి కాలనీ, వల్లభ్నగర్, పోచమ్మ టెంపుల్ ఏరియా, మల్లి కార్జున కాలనీల్లోనూ మరమ్మతుల పేరిట విద్యుత్ కట్ చేశారు. పలు చోట్ల మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా మహబూబ్ నగర్, నారాయణపేటతోపాటు ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నది. బోనాల పండుగ వేళ మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్టిజన్లు సమ్మెకు దిగితే..

ఒకే సంస్థ-ఒకే సర్వీస్ రూల్స్ డిమాండ్ తో విద్యతుత్ శాఖలోని ఆర్టిజన్లు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే అనేక రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేశారు. సమ్మెకు సైతం సిద్ధమవుతున్నారు. ఒక వేళ వారు సమ్మెకు వెళితే విద్యుత్ వినియోగదారులకు మరిన్ని ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతున్నది. కాగా, కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కోతలు విధిస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు.

Next Story