- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పేపర్ లీక్.. విద్యార్థుల పోరాటానికి టీజేఎస్ సంఘీభావం
నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని టీజేఎస్ తీవ్రంగా ఖండించింది.

- రేపు జంతర్మంతర్కు టి.జె.ఎస్ ప్రతినిధుల బృందం
దిశ, వెబ్డెస్క్ : నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్ నాయకులు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై క్రూరంగా లాఠీచార్జి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను తక్షణమే రద్దు చేసి, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ రేపు తెలంగాణ జన సమితి పార్టీ ప్రతినిధుల బృందం ఢిల్లీలోని జంతర్మంతర్లో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును ప్రకటించనుందని టీజేఎస్ నాయకులు తెలిపారు.






